కార్మికులతో చర్చలు విఫలం; టొయోటా బిడది ప్లాంట్స్ లాకౌట్
జపాన్కు చెందిన కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) బెంగుళూరుకు సమీపంలో బిడది వద్ద ఉన్న తమ రెండు కార్ల తయారీ ప్లాంట్లలో ఆదివారం లాకౌట్ ప్రకటించింది. వేతనాల విషయంలో కార్మికులతో టికెఎమ్ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో లాకౌట్ ప్రకటించామని కంపెనీ వివరించింది.
కార్మికుల వేతనాల విషయంపై గడచిన 10 నెలలుగా కార్మికులతో చర్చలు జరుపుతున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ పేర్కొంది. అయితే, ప్రతిసారి ఇరు పక్షాల మధ్య చర్చలు విఫలం అవుతుండటంతో కర్నాటక లేబర్ విభాగం కూడా రంగంలోకి దిగిందని, ఏడుసార్లు త్రైమాసిక సమావేశాలు జరిగాయని, కానీ అన్నీ విఫలమయ్యాయని టికెఎమ్ తెలిపింది.

ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో కలిపి సాలీనా 3,10,000 వాహనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్లాంట్లలో 6,400 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. అయితే, గడచిన 25 రోజులుగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, ఒక వర్గం కార్మికులు కావాలనే ఉత్పత్తికి విఘాతం కలి గిస్తున్నారని టికెమ్ తెలిపింది. ఈ నేపథ్యంలో, ఇతర కార్మికులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని లాకౌట్ ప్రకటిస్తున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ వివరించింది. ఇది ఇలానే కొనసాగితే, టొయోటా వాహనాలకు వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








