మెక్సికన్ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఫోక్స్వ్యాగన్ పోలో
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్వ్యాగన్, భారత మార్కెట్లో ఉత్పత్తి చేస్తున్న తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ పోలోను మెక్సికోకి ఎగుమతి చేయనుంది. మేడ్ ఇన్ ఇండియా ఫోక్స్వ్యాగన్ పోలో 1.6 హైలైన్ వేరియంట్ (అన్ని సేఫ్టీ ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ వేరియంట్)ని కంపెనీ ఎక్స్పోర్ట్ చేయనుంది.
దాదాపు ఏడాది క్రితం ఫోక్స్వ్యాగన్ తమ మేడ్ ఇన్ ఇండియా వెంటో సెడాన్ని మెక్సికోకి ఎగుమతి చేయటం ద్వారా అక్కడి మార్కెట్లోకి ప్రవేశించింది. పూనేలోని చాకన్ వద్ద ఫోక్స్వ్యాగన్ ప్లాంట్లో తయారవుతున్న ప్రతి రెండవ పోలో లేదా వెంటో కారు విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఫ్యాక్టరీ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 89,000 కార్లు ఎగుమతి అయ్యాయి.
ఫోక్స్వ్యాగన్ తమ పూనే ప్లాంట్లో తయారైన కార్లను ఎగుమతి చేయటాన్ని 2011 నుంచి ప్రారంభించింది. తొలుత భారత్లో తయారైన కార్లను దక్షిణాఫ్రికా మార్కెట్కు ఎగుమతి చేసింది. ఆ తర్వాత అనేక దేశాలకు తమ ఎగుమతులను విస్తరించింది. ప్రస్తుతం ఫోక్స్వ్యాగన్ తమ మేడ్ ఇన్ ఇండియా కార్లను సుమారు 32 దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఈ సందర్భంగా ఫోక్స్వ్యాగన్ పూనే ప్లాంట్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కొడుముడి మాట్లాడుతూ.. గడచిన సంవత్సరం తమ వెంటో ద్వారా విజయవంతంగా మెక్సికో మార్కెట్లోకి ప్రవేశించి, భారతదేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తాయని చాటి చెప్పామని అన్నారు.
తాము ప్రపంచ మార్కెట్లలో తయారు చేస్తున్న విధంగానే పూనే ప్లాంట్లో కూడా ధృడమైన, నాణ్యమైన కార్లను ఉత్పత్తి చేస్తున్నామని, భారతదేశంలో తయారైన ఫోక్స్వ్యాగన్ పోలో కారు గ్లోబల్ ఎన్సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్టులో 5 స్టార్లకు గాను 4 స్టార్ల రేటింగ్ను దక్కించుకుందని, ఇదే తమ ఉత్పత్తుల నాణ్యతకి నిదర్శనమని అన్నారు.
గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేయబడిన కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎల్హెచ్డి) సిస్టమ్ను కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








