బస్సు డిజైన్, రోడ్డు నిర్మాణం, డ్రైవర్ నిర్లక్ష్యాలే పాలెం వోల్వో బస్సు ప్రమాదానికి కారణాలు: సిఐడి
గత ఏడాది అక్టోబర్ 30వ తేది తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో 45 మంది అమాయకులు సజీవ దహనమైన విషయం తెలిసినదే. ఈ కేసును దర్యాపు సిఐడి బృందం అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఈ వోల్వో బస్సు ప్రమాదంలో ఆది నుంచి అంతం వరకు ఈ అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
సిఐడి బృందం చేపట్టిన సాంకేతిక దర్యాప్తులో ప్రధానంగా వోల్వో బస్సు డిజైన్లోనే లోపాలు ఉన్నట్లు తేలిందని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు దాదాపు పూర్తయిందని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశామని, త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేయనున్న చార్జ్షీట్లో మరికొందరు నిందితుల పేర్లు చేరుస్తామని ఆయన చెప్పారు.

వోల్వో బస్సులో లోపాలు..
వోల్వో బస్సు డ్రైవర్ సీటు కింద భూమి నుంచి కేవలం 9 నుంచి 12 అంగుళాల ఎత్తులో భారీ బ్యాటరీని అమర్చారు. ఈ బస్సులో మొత్తం మూడు డీజిల్ ట్యాంకర్లు ఏర్పాటు చేయటం, బస్సులోని ఫ్లోర్ను పూర్తిగా చెక్కతో చేయటం, అత్యవసర ద్వారం వద్ద సీటు ఏర్పాటు చేయటం వంటి ఉల్లంఘనలు బస్సులో ఉన్నట్లు సిఐడి తమ నివేదికలో వెల్లడించింది.
రోడ్డు నిబంధనల్లో లోపాలు..
వోల్వో బస్సు ప్రమాదానికి కేవలం బస్సు డిజైనే ప్రధాన కారణంగా కాదు, రోడ్డును వేసిన కాంట్రాక్టర్ కూడా ఇందుకు బాధ్యుడే. ప్రమాదం చోటు చేసుకున్న కల్వర్టు దగ్గర రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. వాస్తవానికి ఇక్కడ రోడ్డును విస్తరించి, కొత్తగా కల్వర్టును కట్టాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కల్వర్టుకు ఆనుకునే స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
డ్రైవర్ నిర్లక్ష్యం..
పాలె వోల్వో బస్సు ప్రమాదానికి పై రెండు కారణాలతో పాటుగా, డ్రైవర్ నిర్లక్ష్యం కూడా మరో కారణంగా సిఐడి వెల్లడించింది. మితిమీరిన వేగంతో బస్సును నడుపుతూ వచ్చిన డ్రైవర్ రహదారికి కుడిపక్కన ఉండే మార్జిన్ లైన్ (తెల్లగీత) దాటి కల్వర్టును ఢీ కొట్టాడు. దాంతో, స్టీల్ బారికేడ్లలోని ఓ రాడ్డు నేరుగా బస్సు క్రింది భాగంలో అమర్చబడి ఉన్న ప్లాస్టిక్ డీజిల్ ట్యాంక్ (300 లీటర్లు)ను బద్దలు కొట్టుకుంటూ లోపలికి దూసుకొచ్చింది. దీంతో ట్యాంకులో డీజిల్ బస్సులోకి ప్రవేశించడం, బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగటం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. బస్సు లోపలి భాగం పివిసి ప్లాస్టిక్తో చేసినది కావటంతో మంటలు మరింత వ్యాగంగా బస్సు మొత్తం వ్యాపించాయి.|

సాక్ష్యాల తారుమారు..
ప్రమాదం జరిగిన తర్వాత ఆ వోల్వో బస్సు పత్రాల విషయంలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. సిఐడి ఇదే విషయాన్ని బట్టబయలు చేసింది. ప్రమాదం జరిగే నాటికి ప్రమాదనికి గురైన సదరు వోల్వో బస్సు బెంగళూరుకు చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరిటే రిజిస్టర్ అయి ఉంది. అప్పట్లో దీని యజమానిగా జె.సి. ప్రభాకర్ రెడ్డి భార్య జె.సి.ఉమారెడ్డి ఉన్నారు. ఆమె పేరిట బస్సును బుక్ చేసి, బ్యాంకులో రుణం కూడా తీసుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత పాత తేదీలతో జబ్బార్ ట్రావెల్స్తో వివిధ లీజు అగ్రిమెంట్లను సృష్టించారు. సీఐడీ దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావటంతో జె.సి. ఉమారెడ్డిని బుధవారం అరెస్టు చేసి వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆమె ఏ9 ముద్దాయిగా ఉన్నారు.
నిందితుల జాబితాలో వోల్వో కంపెనీ..
పాలెం వోల్వో బస్సు ప్రమాదంలో వోల్వో కంపెనీని సైతం సిఐడి నిందితుల జాబితాలో చేర్చింది. లోపపూరితమైన బస్సులను తయారు చేసినందుకు గాను ఈ వోల్వో కంపెనీ కూడా ముద్దాయిగా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వోల్వో సర్వీసుల్ని రద్దు చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక కూడా పంపుతామని కృష్ణప్రసాద్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications








