పాలెం ప్రమాదం: బస్సు డిజైనింగ్లో లోపం లేదు-వోల్వో యాజమాన్యం
గత ఏడాది అక్టోబర్ 30వ తేది తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో దర్యాప్తును కొనసాగించిన సిఐడి బృందం తాజాగా తమ నివేదికను వెల్లడించి, ఇందులో ప్రధానంగా బస్సు డిజైన్లో లోపాలను గుర్తించామని ప్రకటించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ విషయాన్ని వోల్వో యాజమాన్యం ఖండిస్తోంది.
వోల్వో బస్సు డిజైనింగ్లో ఎలాంటి లోపాలు లేవని, తాము గత 12 ఏళ్లుగా దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని, భారతీయ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటిస్తున్నట్లు వోల్వో కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదం జరిగినపుడు వోల్వో బస్సు గంటకు 100 కి.మీకు పైగా వేగంతో సిమెంట్ దిమ్మెకు గుద్దుకుందని, ఈ తీవ్రత 5 మెగాజౌళ్ల శక్తికి సమానమని, అందుకో తీవ్ర నష్టం సంభవించిందని వోల్వో వివరించింది.

ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అత్యధిక శాతం బాహ్య అంశాలే కారణమని, వాటికి డిజైనింగ్తో సంబంధం లేదని వోల్వో సంస్థ పేర్కొంది. 200 కోట్ల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రాకపోకలు సాగించిన వోల్వో బస్సులు 5000 లకు పైగానే ఉన్నాయని, బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడం, రోడ్డు డిజైన్, డ్రైవర్ తీరు వంటి కారణాల వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కంపెనీ తెలిపింది.
వోల్వో బస్సు డిజైన్ విషయంలో సిఐడి బృందం ఏం చెప్పింది..?
ప్రమాదనికి గురైన వోల్వో బస్సులో డ్రైవర్ సీటు కింద భూమి నుంచి కేవలం 9 నుంచి 12 అంగుళాల ఎత్తులో భారీ బ్యాటరీని అమర్చారు. ఈ బస్సులో మొత్తం మూడు డీజిల్ ట్యాంకర్లు ఏర్పాటు చేయటం, బస్సులోని ఫ్లోర్ను పూర్తిగా చెక్కతో చేయటం, అత్యవసర ద్వారం వద్ద సీటు ఏర్పాటు చేయటం వంటి ఉల్లంఘనలు బస్సులో ఉన్నట్లు సిఐడి తమ నివేదికలో వెల్లడించింది. పాలెం వోల్వో బస్సు ప్రమాదంలో వోల్వో కంపెనీని సైతం సిఐడి నిందితుల జాబితాలో చేర్చింది.

లోపపూరితమైన బస్సులను తయారు చేసినందుకు గాను ఈ వోల్వో కంపెనీ కూడా ముద్దాయిగా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వోల్వో సర్వీసుల్ని రద్దు చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక కూడా పంపుతామని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ తెలిపారు. తప్పు ఎవరిదైనప్పటికీ, పాలెం బస్సు ప్రమాదంలో 45 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.


Click it and Unblock the Notifications








