భద్రతా నిబంధనలను మార్చేందుకు సిద్ధంగా ఉన్నాం: మారుతి
గ్లోబల్ ఎన్సిఏపి ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్టులో మేడ్ ఇన్ ఇండియా స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ జీరో రేటింగ్తో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కోరినట్లయితే, తమ కార్లలో సేఫ్టీ నిబంధనలను మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.
ఈ విషయంపై మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి మాట్లాడుతూ.. కొత్త వాహనాల విషయంలో ప్రస్తుతం భారత ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా నిబంధనలకు లోబడే తమ వాహనాలు తయారవుతున్నాయని వివరించారు.
ఇటీవలి గ్లోబల్ ఎన్సిఏపి క్రాష్ టెస్ట్ ఫలితాలపై స్పందిస్తూ.. తాము భారతీయ ప్రమాణాల ప్రకారం కారును తయారు చేస్తే, సదరు క్రాష్ టెస్ట్ను మాత్రం అంతర్జాతీయ ప్రణామాలు లోబడి నిర్వహించారని చెప్పారు. భారత్లో కారు భద్రతకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటిస్తున్నామని, ఒకవేళ ప్రభుత్వం కోరితే, ఈ నిబంధనలను మార్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని కల్సి తెలిపారు.

ఇదే విషయంపై నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ ఆర్ అండ్ డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎన్ఏటిఆర్ఐపి) సీఈఓ, ఐఏఎస్ ఆఫీసర్ నితిన్ ఆర్ గోకర్ణ్ మాట్లాడుతూ.. ఈ క్రాష్ టెస్టులను సాధారణంగా ఇండియాలో గంటకు 56 కిలోమీటర్ల వేగం వద్ద చేస్తారని, ఆయితే వారు మాత్రం వీటిని గంటకు 64 కిలోమీటర్ల వేగం వద్ద నిర్వహించారని అన్నారు. ఈ వేగ పరిమితికి (గంటకు 56 కి.మీ.) తగినట్లుగానే ఇండియన్ కార్లలోని సేఫ్టీ ఫీచర్లు డిజైన్ చేయబడి ఉంటాయని, కాబట్టి ఇలాంటి కార్లను అధిక స్పీడ్ వద్ద టెస్ట్ చేస్తే ఒకేరకమైన ఫలితాలు రావని వివరించారు.
వాస్తవానికి ఒక్కోసారి యాక్సిడెంట్లు కంపెనీలు/ప్రభుత్వం నిర్దేశించిన స్పీడ్ లిమిట్ (54 కి.మీ. కానివ్వండి లేదా 64 కి.మీ కానివ్వండి)కు మించి కూడా జరుగుతుంటాయి. దాదాపుగా జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ భాగం ఓవర్ స్పీడ్ (మితమీరిన వేగం) వల్లనే జరుగుతుంటాయి. మరి అలాంటప్పుడు నిర్దిష్ట వేగ పరిమితుల వద్ద మాత్రమే భద్రతా ఫీచర్లు పనిచేయటం లేదా సదరు స్పీడ్స్కి మాత్రమే కట్టుబడి సేఫ్టీ ఫీచర్లను తయారు చేయటం అనేది ఎంత వరకూ సమంజసం అంటారు..?


Click it and Unblock the Notifications








