వాహన జీవితకాలం 15 ఏళ్లు గడిచినా నడుపుకోవచ్చు!
భారతదేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలం చెల్లిపోయిన పాత వాహనాలను రోడ్లపై నుంచి తొలగించాలని ప్రభుత్వం గతంలో యోచించిన సంగతి తెలిసినదే. అయితే, ప్రభుత్వం ఇప్పుడు తమ ప్లాన్ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం, ఢిల్లీలో 15 ఏళ్లు నిండిపోయిన వాహనాలను రోడ్లపై నిషేధించి, స్క్రాప్గా మార్చాలని మొదట్లో భావించారు.
ప్రస్తుతం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రైవేట్ వాహనాల వయో పరిమితి (ఏజ్ లిమిట్)ని తప్పని సరిచేస్తూ ప్రతిపాదన చేయబోవటం లేదని, ఎందుకంటే ఇదొక షార్ట్-కట్ ప్రక్రియ అని రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ్ సుప్రీం కోర్టుకు వివరించింది. కానీ, వాణిజ్య మరియు రవాణా వాహనాల విషయంలో 15 ఏళ్ల ఏజ్ లిమిట్ మాత్రం అమల్లోకి వచ్చే ఆస్కారం ఉందని తెలిపింది.

పాత వాహనాలను మార్కెట్ నుంచి తొలగించడానికి బదులుగా, వాటి ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయంలో సవరణలు చేస్తే సరిపోతుందని రవాణా శాఖ భావిస్తోంది. ఈ ఫిట్నెస్ టెస్టుల వలన సదరు వాహనం, దాని జీవితకాలం ముగింపుకు చేరుకుందో లేదో తెలిసిపోతుందని పేర్కొంది. ఈ టెస్టుల కోసం మోటార్ వాహన చట్టంలోని 56వ సెక్షన్లో పేర్కొన్నట్లుగా మరిన్ని అధీకృత టెస్ట్ స్టేషన్లను తీసుకురావల్సిన అవసరం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి స్టేషన్లను రెగ్యులేటెడ్ ప్రైవేట్ సెక్టార్లలో తీసుకురావటం జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రతి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన 15 ఏళ్ల వరకూ ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి చొప్పున ఫిట్నెస్ టెస్టింగ్ చేయించి సర్టిఫికెట్ పొందాలని, వాహనం వయస్సు 15 ఏళ్లు దాటినట్లయితే ప్రతి 2-3 ఏళ్లకు ఒక్కసారి చొప్పున ఫిట్నెస్ టెస్టింగ్ చేయించాలని ఈ శాఖ ప్రతిపాదిస్తోంది. అలాగే.. జాతీయ వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)ని మెరుగు పరచేందుకు కూడా తమ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1, 2017 నాటికి స్వచ్ఛమైన బిఎస్-4 పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ని సప్లయ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టుకు తెలిపింది.


Click it and Unblock the Notifications








