ప్రతి కారులో కనీస భద్రతా ఫీచర్లు ఉండాలి: నితిన్ గడ్కరీ
భారతదేశంలో వాహనాల భద్రత విషయంలో నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో, రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచేందుకు మరియు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు గాను మోటార్ వాహన చట్టాల్లో నిబంధనలను సవరించనున్నారు.
తాజాగా.. ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. అన్ని రకాల వాహనాల్లోను కనీస భద్రతా ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వచ్చే 2017వ సంవత్సరం అన్ని ఇండియన్ కార్లకు సేఫ్టీ టెస్టులను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారీ పరిశ్రమల శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) వంటి సంస్థలతో కూడిన ఓ కమీటి వాహనాల భద్రతకు సంబంధించిన ప్రమాణాలు నిర్దేశించనుంది. ఈ ప్రమాణాలను నిర్దేశించిన తర్వాత కొత్త వాహనాలను భారత్ న్యూ వెహికల్ సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (బిఎన్విఎస్ఏపి) క్రింద టెస్ట్ చేసి, సేఫ్టీ రేటింగ్ ఇస్తారు.
కొత్త నియమావళి అమల్లోకి వస్తే, వాహనాలు గంటకు 56 కిలోమీటర్ల వేగం వద్ద క్రాష్ టెస్ట్ నిర్వహించి, అందులోని ప్రయాణికుల భద్రతను అంచనా వేస్తారు. ఈ క్రాష్ టెస్టుకు కారు అర్హత సాధించాలంటే, ఇందులో కనీసం ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, సీట్ బెల్ట్ రిమైండర్, చైల్డ్ లాక్ వంటి కనీస సేఫ్టీ ఫీచర్లు ఉండాలి.


Click it and Unblock the Notifications








