తిరిగి ప్రారంభమైన రిలయన్స్ పెట్రోల్ బంకులు
గడచిన కొన్నేళ్లుగా మూతబడి ఉన్న రియలన్స్ పెట్రోల్ బంకులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇటీవలే డీజిల్ ధరలపై నియంత్రణలు ఎత్తివేయటంతో, దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పెట్రోల్ బంకులు క్రమంగా రీఓపెన్ అవుతున్నాయి.
గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎమ్సీ) సబ్సిడీ ధరల దెబ్బకు తట్టుకోలేక మూసేసిన వాటిలోని ఐదో వంతు (230) పెట్రోల్ బంకులలో విక్రయాలను పునఃప్రారంభించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. కంపెనీ తమ మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన అనంతరం ఇన్వెస్టర్లకు ఈ విషయాన్ని తెలిపింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చ్ 2008 ప్రాంతంలో తమకున్న మొత్తం 1,432 పెట్రోల్ బంకులను మూసివేసింది. ఇందుకు ప్రధాన కారణంగా, ఇంధనాన్ని సబ్సిడీ ధరకే విక్రయించడం వలన వచ్చిన నష్టాలే. వాస్తవానికి, ప్రభుత్వ రంగ చమురు కంపెనీల విషయంలో అయితే, ఈ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ వచ్చేది, కానీ ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు మాత్రం తమ భారాన్ని తామే మోసుకోవాల్సి వచ్చేది. అందుకే, పెరుగుతున్న నష్టాలను తట్టుకోలేక ఆర్ఐఎల్ తమ అన్ని పెట్రోల్ బంకులను మూసివేసింది. కాగా.. మూసివేసిన తమ మొత్తం పెట్రోల్ బంకుల నెట్వర్క్ను ఒక్క ఏడాదిలోనే తిరిగి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.
జూన్ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోలు ధరలపై నియంత్రణలను ఎత్తివేయడంతో మరో ప్రైవేటు చమురు కంపెనీ ఎస్సార్ ఆయిల్స్ కూడా తమకున్న 1,400 పైచిలుకు బంకులలో పెట్రోలు విక్రయాలను ప్రారంభించింది. తాజాగా.. డీజిల్ ధరలపై కూడా నియంత్రణలు ఎత్తి వేయడంతో, తమ పెట్రోల్ బంకులన్నింటిలో డీజిల్ ఇంధనాన్ని కూడా విక్రయిస్తామని ఎస్సార్ తెలిపింది.


Click it and Unblock the Notifications








