100 కార్లు గుద్దుకున్నాయ్.. ఇద్దరు మృతి, 60 మందికి గాయాలు
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో బుధవారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు వందకు పైగా కార్లు ఇతర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఇంచెయాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఇయోంగ్జాంగ్ వంతెనపై వాహనాలను ఒకదాని వెనుక మరొకటి గుద్దుకుంటూ దాదాపు 4 కిలోమీటర్ల వందకు పైగా వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక పోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సముద్రంపై నిర్మించిన ఈ వంతెన ఎయిర్పోర్ట్ నుండి సియోల్కు కలుపబడి ఉంటుంది. దీని మొత్తం పొడవు 4,400 మీటర్లు. ఈ వంతెనపై డ్యామేజైన కార్లను పోలీసులు తొలగిస్తున్నారు. దట్టమైన పొగమంచు, తడిసిన రోడ్డు కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రమాదానికి గురైన డ్రైవర్లలో ఒకరైన లీ గయాంగ్ మాట్లాడుతూ.. ఫాగ్ (పొగమంచు) ఎక్కువగా ఉండటం వలన తాను రోడ్డుపై 10 మీటర్ల కంటే ఎక్కువ దూరం చూడలేకపోయానని, ఫలితంగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లానని, అయితే ముందున్న వాహనపు బ్రేక్ లైట్లను గుర్తించి, తాను బ్రేక్ వేసినప్పటికీ, వెనుక నుంచి వాహనం తన వాహనాన్ని కూడా ఢీకొట్టిందని తెలిపాడు.
పొగమంచు కారణంగా దాదాపు 18 విమానాల టేకాఫ్ జాప్యం కాగా, సుమారు 7 విమానాల ల్యాండింగ్ ఆలస్యమైనట్లు సమాచారం. కాగా.. గతంలో 2006లో కూడా దక్షిణ కొరియాలో మరొక సీ-క్రాస్ బ్రిడ్జ్పై ఇలాంటి ప్రమాదమే జరగగా అందులో 11 మంది మృతి చెందగా, సుమారు 50 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు.


Click it and Unblock the Notifications








