2015 చివరి నాటికి 15 జీప్ డీలర్షిప్లను ఏర్పాటు చేయనున్న ఫియట్
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ క్రైస్లర్ గ్రూప్ భారత్లో జీప్ బ్రాండ్ను ప్రవేశపెట్టనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. వాస్తవానికి గడచిన సంవత్సరమే ఫియట్ ఇండియా, తమ జీప్ వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన అది సాధ్యం కాలేదు.
అయితే, ఈ ఏడాదిలో తప్పనిసరిగా ఫియట్ జీప్ వాహనాలు భారత్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫియట్ తమ్ జీప్ ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయటానికంటే ముందుగా దేశవ్యాప్తంగా తమ డీలర్షిప్ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకోనుంది. ఇందులో భాగంగా జీప్ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా షోరూమ్లను ఏర్పాటు చేయనుంది.

ముందుగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీప్ బ్రాండ్ కోసం దేశవ్యాప్తంగా 15 డీలర్లను ఏర్పాటు చేయనున్నారు. ఫియట్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక షోరూమ్లలో కేవలం జీప్ వాహనాలను మాత్రమే విక్రయించనున్నారు. ప్రారంభంలో భాగంగా, ఇండియాలో జీప్ బ్రాండ్ వాహనాలను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.
కాగా.. భవిష్యత్తులో వీటిని ఇక్కడే భారత్లోనే అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. జీప్ బ్రాండ్ నుంచి ముందుగా గ్రాండ్ చిరోకీ, వ్రాంగ్లర్ మోడళ్లు విడుదల కానున్నాయి. ఫియట్ ఇప్పటికే ఈ మోడళ్లను ఆర్ అండ్ డి ప్రయోజనం కోసం ఇండియాకు దిగుమతి చేసుకుంది. దేశీయ మార్కెట్లో ఇవి ఆడి క్యూ7, బిఎమ్డబ్ల్యూ ఎక్స్5, రేంజ్ రోవర్ స్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications








