4 శాతం మేర పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు
మారుతి సుజుకి కార్లు మరింత ప్రియం అయ్యాయి. గడచిన డిసెంబర్ నెలలో ప్రకటించినట్లుగానే, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా తమ కార్ల ధరలను 4 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 2014తో ఎక్సైజ్ సుంకపు రాయితీ గడువు ముగియటంతో దాదాపు అన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో మారుతి కూడా కార్ల ధరలను పెంచింది. ప్రభుత్వం ఎంతైతే ఎక్సైజ్ డ్యూటీని పెంచిందో, అదే భారాన్ని వినియోగదారులపై బదిలీ చేస్తామని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ఎస్ కల్సి తెలిపారు. గడచిన అక్టోబర్ 2013లో చివరి సారిగా మారుతి తమ కార్ల ధరలను పెంచింది. ఆ తర్వాత ధరలను పెంచడం ఇదే మొదటిసారి.

గత కొంత కాలంగా మారుతి సుజుకి ధరల భారాన్ని తనే భరిస్తూనే వస్తోందని, మార్కెట్ పరిస్థితులు సరిగ్గా లేనందున తాము తమ ఉత్పత్తుల ధరలను పెంచలేదని, ఈ నేపథ్యంలో, ధరల వత్తిడిని తట్టుకునేందుకు స్వల్పంగా పెంపును విధించాలని నిర్ణయించామని ఆయన వివరించారు.
ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో ఆల్టో 800 మొదలుకొని గ్రాండ్ విటారా వరకూ వివిధ సెగ్మెంట్లో ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. మార్కెట్లో మారుతి కార్ల ధరలు రూ.2.37 లక్షల నుంచి రూ.24.6 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








