ఢిల్లీలో ఈ-రిక్షాలకు గ్రీన్ సిగ్నల్ ప్రకటించిన ప్రెసిడెంట్
దేశ రాజధాని ఢిల్లీలో ఈ-రిక్షా (ఎలక్ట్రిక్ ఆటోరిక్షా)లను తిప్పుకునేందుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ హైకోర్టు ఈ-రిక్షాలపై నిషేధం విధించిన సంగతి తెలిసినదే. అయితే, తాజాగా మోటార్ వాహన చట్టంలో కొన్ని సవరణలు చేసి, ఈ-రిక్షాలను రోడ్లుపై అనుమతించేందుకు అవకాశం కల్పించారు. ఈమేరకు పార్లమెంటులో బిల్లును కూడా పాస్ చేశారు.
తాజా నిబంధనల మేరకు ఈ-రిక్షాలను నడిపేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ ఎలక్రిక్ వాహనాలలో అనుమతించదగిన గరిష్ట శక్తి 2000 వాట్లు మరియు దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. గతంలో పేర్కొనట్లుగా లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్ కనీసం ఏడాది పాటు కలిగి ఉన్న వారికే వాణిజ్య వాహనాన్ని నడిపేందుకు లెర్నర్స్ లెసైన్స్ ఇవ్వాలన్న నిబంధనను కొట్టివేసినట్లు సమాచారం.

ఈ-రిక్షాలు నడపడానికి డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి చేస్తూ, వాటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ ప్రభుత్వం గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఆర్డినెన్స్ జారీ చేసింది. స్పెషల్ పర్పస్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్స్ నడవడానికి వీలుగా ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నిబంధలు- 2014 (16వ సవరణ )ను నోటిఫై చేసింది.
ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలలో నలుగురు ప్రయాణికులకు మించి ప్రయాణించరాదని, 40 కిలోల బరువు సామగ్రికి మించి తీసుకెళ్లరాదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, వస్తువులను రవాణా చేసే ఈ-కార్ట్లు 310 కేజీల వరకూ బరువు కలిగిన వస్తువులను మాత్రమే మోసుకెళ్లాలని సూచించింది. ఈ-రిక్షాలు ఇతర వాహనాలకు, పౌరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు గడచిన సంవత్సరం జులై 31న ఢిల్లీలో వాటిపై నిషేధం విధించిన విషయం విధితమే.


Click it and Unblock the Notifications








