డీజిల్ ఇంజ్లను స్థానికంగానే అసెంబ్లింగ్ చేయనున్న ఫోక్స్వ్యాగన్ ఇండియా
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్వ్యాగన్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న డీజిల్ కార్లలో ఉపయోగించే ఇంజన్లను ఇప్పటి వరకూ సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, తమ వాహనాల్లో ఉపయోగించేంది. అయితే, ఇకపై ఫోక్స్వ్యాగన్ ఇండియా తమ డీజిల్ ఇంజన్లను భారతదేశంలోనే అసెంబ్లింగ్ చేయనుంది.
ఈ మేరకు ఫోక్స్వ్యాగన్ ఇండియా, పూనేలోని చాకన్ పారిశ్రామిక ప్రాంతం వద్ద ఓ డీజిల్ ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్ను ప్రారంభించింది. మొత్తం 3500 చ.మీ. విస్తీర్ణంలో, దాదాపు రూ.240 కోట్ల పెట్టుబడిని వెచ్చించి, ఈ ప్లాంట్ను నిర్మించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి డేవంద్ర ఫడ్నవిస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్లాంట్ను ప్రారంభించారు.

ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రారంభించిన ఈ అసెంబ్లింగ్ లైన్లో ప్రత్యేకించి డీజిల్ ఇంజన్లను మాత్రమే తయారు చేయనున్నారు. ఈ ఇంజన్లను కంపెనీ విక్రయిస్తున్న పోలో హ్యాచ్బ్యాక్, వెంటో సెడాన్ కార్లలో ఉపయోగించనున్నారు. అలాగే.. ఫోక్స్వ్యాగన్ గ్రూపుకి చెందిన స్కొడా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్లో కూడా ఇవే డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు.
ఫోక్స్వ్యాగన్ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లో సాలీనా 98,000 యూనిట్ల డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటి వరకూ ఫోక్స్వ్యాగన్ భారత్లో ఆఫర్ చేస్తున్న 1.5 డీజిల్ ఇంజన్ను పోలాండ్ నుంచి దిగుమతి చేసుకునేది. ఇకపై, ఈ ఇంజన్లను భారత్లోనే అసెంబ్లింగ్ చేయనున్నారు. ఈ డీజిల్ ఇంజన్లను స్థానికంగానే అసెంబ్లింగ్ చేస్తున్నప్పటికీ, వాహనాల ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








