భారత్లో అసెంబ్లింగ్ ప్లాన్స్: వోల్వో కార్ల ధరలు తగ్గుతాయా?
స్వీడన్కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ వోల్వో, భారత్లోనే తమ కార్లను అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ మోటార్స్ మరియు జనరల్ మోటార్స్ ఇండియా సంస్థలతో వోల్వో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వోల్వో ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ ఉత్పత్తులను పూర్తిగా విదేశాలలో తయారు చేసి, ఇక్కడి మార్కెట్కు దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా ఆయా వోల్వో కార్ మోడళ్ల ధర కూడా అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, వోల్వో కార్లను భారత్లో అసెంబ్లింగ్ చేయగలిగినట్లయితే, సరసమైన ధరకే వాటిని అందించి అమ్మకాలను భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, వోల్వో కంపెనీ ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ మోటార్స్, జనరల్ మోటార్స్ కంపెనీలతో ప్రారంభ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై స్పందించేందుకు మాత్రం వోల్వో సిద్ధంగా లేదు. అలాగే, పై మూడు దేశీయ కార్ కంపెనీలు కూడా ఈ వార్తలను కొట్టిపారేస్తున్నాయి, ఇవన్నీ ఊహాగానాలని తేల్చి చెబుతున్నాయి.
వోల్వో ఆటో ఇండియా 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం వోల్వో దేశీయ విపణిలో విక్రయిస్తున్న మోడళ్లలో ఎస్80, ఎస్60 సెడాన్లు మరియు ఎక్స్సి60, ఎక్స్సి90 ఎస్యూవీలతో పాటుగా వి40 క్రాస్ కంట్రీ అనే క్రాసోవర్లు ఉన్నాయి. వోల్వో ఇండియాకు న్యూఢిల్లీ, గుర్గావ్, అహ్మదాబాద్, సూరత్, ముంబై, ఛండీఘడ్, కోయంబత్తూర్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కొచ్చి, విశాఖపట్టణం, పూనే నగరాల్లో డీలర్షిప్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








