బిఎస్3 రద్దు ప్రభావం: అమ్ముడుపోని వాహనాల విలువ రూ. 5000 కోట్లు
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు బిఎస్3 వాహనాల విక్రయాలను ఏప్రిల్1 నుండి పూర్తిగా రద్దు చేసింది. దీంతో బిఎస్3 వాహనాల అమ్ముడుపోకుండా భారీ సంఖ్యలో మిగిలిపోయాయి.
సుప్రీం కోర్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఎస్3 వాహనాల బ్యాన్ ఆటోమొబైల్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపింది. గడువులోపు బిఎస్3 వాహనాలను విక్రయించేందుకు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటించినప్పటికీ 5000 కోట్ల రుపాయల వరకు నష్టం వాటిల్లింది.

దేశీయ వ్యాపార వాతావరణంలో అనిశ్చితి పెరగడం ఆటోమొబైల్ పరిశ్రమలో పెట్టుబడుల మీద తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. బిఎస్3 వాహనాల మీద విధించిన రద్దు సుమారుగా 20,000 కోట్ల రుపాయల విలువైన 8 లక్షల వాహనాల మీద ప్రభావం పడినట్లు దేశీయ వాహన తయరీదారుల సంఘం సియామ్ పేర్కొంది.

సియామ్ డైరక్టర్ జనరల్ విష్ణు మథుర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బిఎస్3 వాహనాల సంఖ్య 1.2 లక్షల యూనిట్లు మరియు వీటి విలువ సుమారు రూ. 5,000 కోట్ల పైమాటే అని తెలిపాడు.

బిఎస్3 వాహనాల స్టాకును క్లియర్ చేసుకునేందుకు కేవలం ద్విచక్ర వాహన తయారీదారులు మాత్రమే భారీ సంఖ్యలో ఆఫర్లు ప్రకటించాయి. దాదాపు గరిష్ట విక్రయాలు చేపట్టినప్పటికీ భారీ డిస్కౌంట్ల ద్వారా రూ. 12,000 కోట్లు నష్టం వాటిల్లింది.

ఏప్రిల్1, 2017 తరువాతస కూడా బిఎస్3 వాహనాలను విక్రయించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించినా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బిఎస్3 వాహనాల విక్రయాలను పూర్తిగా రద్దు చేసిన విషయాన్ని సియామ్ గుర్తుకుచేసింది.

వ్యాపార వాతావరణంలో అనిశ్చితి పెరిగిపోవడం భారతీయ వాహన పరిశ్రమ పెట్టుబడుల మీద ప్రభావం ఎక్కువవుతోందని మథుర్ పేర్కొన్నారు. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు పరిశ్రమ దీర్ఘకాలిక కొనసాగింపు మీద కూడా ప్రభావం ఏర్పడుతుందని ఆయన తెలిపాడు.

అయితే ప్రస్తుతం మిగిలిపోయిన బిఎస్3 వాహనాలను ఏం చేయాలనేది ఆ యా తయారీ సంస్థలదే తుది నిర్ణయం. అయితే కొన్ని సంస్థలు మాత్రమే ఇతర విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం తప్పితే మరో అవకాశం లేవంటున్నాయి.

మార్చి 31, 2017 నాటి తారీకు బిల్లుతో కొనుగోలు చేసిన అన్ని వాహనాలను కూడా అప్పటి నుండి తదుపరి మూడు నెలలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








