అనంతపురంలో 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటుకు సిద్దమైన కియా మోటార్స్
ఇండియాలోకి రాక మరియు ప్రొడక్షన్ ప్లాంటు ఏర్పాటుకు సంభందించిన వివరాలను కియా మోటార్స్ ఎట్టకేలకు అవిష్కరించింది. దీంతో పాటు ప్రారంభంలో విడుదలయ్యే కార్ల వివరాలను కూడా ప్రకటించింది.
హ్యుందాయ్ మోటార్స్ అనుభంద సంస్థ అయిన కియా మోటార్స్ దేశీయంగా ఉన్న మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్దమైంది. కియా మోటార్స్ రాకపై ఇప్పటి వరకు ఉన్న ఆధారం లేని వార్తలను నిజం చేస్తూ, ఈ ప్రాజెక్టుకు సంభందించిన కొన్ని వివరాలను కియా మోటార్స్ వెల్లడించింది.

కియా మోటార్స్ దేశీయంగా తమ మొదటి తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడానికి యాజమాన్యం సిద్దమైంది. ప్రాథమికంగా ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 3,00,000 యూనిట్లుగా ఉంది.

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్, హ్యుందాయ్ భాగస్వామ్యంతో రానుంది. 536 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంటు కోసం 7050 కోట్ల రుపాయలను వివిధ దశలలో వెచ్చించనున్నారు.

2019 ఏడాది మలిసగంలో ఈ ప్లాంటులో కార్ల తయారీని ప్రారంభించనున్నారు. మరియు కియా మోటార్స్ ఉత్పత్తి చేసే కార్లను ఆ తరువాత సంవత్సరం నుండి విపణిలోకి పూర్తి స్థాయి విక్రయాలకు సిద్దం చేయనున్నారు.

భారతీయ వాహన పరిశ్రమను క్షుణ్ణంగా పరిశీలించిన కియా మోటార్స్ సంస్థ వ్యక్తిగత ప్రణాళికలు రచించింది. ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పట్టు కోసం కాంపాక్ట్ సెడాన్ మరియు ఎస్యూవీ కార్ల అభివృద్ది మీద దృష్టిసారించింది.

ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ మోటార్స్తో పోల్చుకుంటే భిన్నంగా ఉండే కియా మోటార్స్ దేశీయంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది. అందుకు తగిన ఉత్పత్తులనే అభివృద్ది చేసే పనిలో ఉంది.

ప్రారంభంలో 40 శాతం దేశీయంగా ఉత్పత్తి అయిన విడిపరికరాలతో కార్లను ఉత్పత్తి చేయాలనుకుంది. ఆ తరువాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగి హ్యుందాయ్ తరహాలో పూర్తి స్థాయిలో వాహన తయారీకి కావాల్సిన అన్ని ఉత్పత్తులను 100 శాతం దేశీయంగా తయారు చేయనుంది.

కియా ఉత్పత్తి చేయనున్న కార్ల కోసం హ్యుందాయ్లో ఉన్న కొన్ని ఫ్లాట్ఫామ్లను వినియోగించుకోనుంది. ధరలను కూడా పోటీని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించనుంది. ఇక ఇంజన్లను దాదాపు హ్యుందాయ్ నుండి సేకరించే అవకాశం ఉంది.

ప్రధాన సెగ్మెంట్లలో, ప్రీమియమ్ వాహనాలను మరియు ఉత్పత్తుల బ్రాండ్ విలువను పెంచే దిశగా కియా మోటార్స్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైంది.

కియా మోటార్స్ ప్రారంభంలో స్పోర్టేజ్ ఎస్యూవీని, ఇండియన్ రోడ్ల మీద పలుమార్లు కనిపించిన కియా మోడళ్లను అదే విధంగా కియా పికంటో మరియు కియా రియో కార్లను విడుదల చేసే అవకాశం ఉంది.

కియా బ్రాండ్ విలువను పెంచే ఉత్పత్తిగా స్టింగర్ స్పోర్ట్స్ సెడాన్ కారును విడుదల చేయనుంది. ఇందులో 370బిహెచ్పి పవర్ ఉత్పత్తి చేయగల 3.3-లీటర్ల సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో-ఛార్జ్డ్ వి6 ఇంజన్ కలదు.


Click it and Unblock the Notifications








