ఎలక్ట్రిక్ కార్ల తయారీ గురించి మారుతి సుజుకి ఏమన్నదో తెలుసా?
ఎలక్ట్రిక్ కార్ల తయారీ గురించి భవిష్యత్తు ప్రణాళికలను మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్సి భార్గవ్ వెల్లడించారు.
Recommended Video

భారత ప్రభుత్వం మరో దశాబ్ద కాలంలోపు రోడ్ల మీదకు కేవలం ఎక్ట్రిక్ కార్లను మాత్రమే అనుమతించే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో తమకంటూ కొంత సొంత పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్నాయి.

ఈ తరుణంలో దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల తయారీ గురించి స్పందించింది. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికలను మారుతి ఇండియా చైర్మెన్ ఆర్సి భార్గవ్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో మారుతి ప్రవేశించడం లేదని ఆర్సి భార్గవ్ వెల్లడించారు.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కేవలం మహీంద్రా మాత్రమే ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. మహీంద్రా లైనప్లో ఇ2ఒ మరియు ఇ-వెరిటో ఎలక్ట్రిక్ కార్లు విపణిలో ఉన్నాయి. మరికొన్ని ఇతర సంస్థలు హైబ్రిడ్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, జిఎస్టి రాకతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల తయారీ గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

ఎలక్ట్రిక్ కార్లను వినియోగించే దిశగా ప్రజలను చైతన్యపరచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని మారుతి సుజుకి ఇండియా ఛైర్మెన్ ఆర్సి భార్గవ్ తెలిపాడు. ఎలక్ట్రిక్ కార్లను వినియోగించడం ద్వారా పరిశుభ్రమైన పర్యావరణం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చాడు.

మారుతి సుజుకి భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్ ప్లాన్ గురించి భార్గవ్ స్పందిస్తూ, "ఫ్యూచర్లో మారుతి ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించే అవకాశాలు లేవు, అయితే కస్టమర్ల అభిప్రాయం మేరకు ఎలక్ట్రిక్ కార్లతో మారుతి ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు."

ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది, తయారీ మరియు ఉత్పత్తికి బదులుగా కొత్త టెక్నాలజీని పరిచయం చేసి, ప్రస్తుతం ఉన్న కార్ల మైలేజ్ పెంచే దిశగా పనిచేయనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం 50 శాతం వరకు మార్కెట్ వాటాను మారుతి సొంతం చేసుకుంది.

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న అడ్డంకుల్లో మౌలిక సదుపాయాలు ప్రధాన సమస్యగా ఉంది. దేశవ్యాప్తంగా కావాల్సినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఎలక్ట్రిక్ కార్లను వినియోగించడం చాలా కష్టతరమవుతుంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఎలక్ట్రిక్ కార్ల ప్రణాళికల గురించిన అభిప్రాయాన్ని వెల్లడించింది. దేశీయంగా అత్యంత సరసమైన కార్లను తయారు చేసే సంస్థగా మారుతి పేరుగాంచింది. కాబట్టి భవిష్యత్తులోనైనా ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications