ప్రపంచపు అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా ఎదిగేందుకు వోక్స్వ్యాగన్ మరో ప్రణాళిక
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో రాణించేందుకు వోక్స్వ్యాగన్ మరో అడుగు ముందుకేసింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం చైనాకు చెందిన జెఎసి మోటార్తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రపంచపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో ప్రపంచ వ్యాప్తంగా రాణించేందుకు మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం ఉన్న నిస్సాన్-రెనో భాగస్వామ్యం మరియు టెస్లా సంస్థలను ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అధిగమించేందుకు చైనాకు చెందిన జెఎసి మోటార్ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

వోక్స్వ్యాగన్ మరియు జెఎసి సంస్థలు సంయుక్తంగా ఏడాదికి 1,00,000 ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిని చైనా మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి చేసే విధంగా కలిసి పనిచేయనున్నాయి.

నిజానికి ఇరు సంస్థలు కూడా గత ఏడాది నుండే ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు చేసుకున్నాయి, అయితే అనివార్య కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వోక్స్వ్యాగన్ చేసిన ప్రకటనలో వచ్చే పదేళ్లలోపు 30 కొత్త ఎలక్ట్రిక్ కార్ల రూపొందించనున్నట్లు తెలిపింది.

వోక్స్వ్యాగన్ గ్రూపు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఆటో షో లలో విభిన్న ఎలక్ట్రిక్ కార్లను మరియు అటానమస్ (స్వయం చాలక) కార్లను ప్రదర్శిస్తూ వచ్చింది. అందులో ఐ.డి. క్రాజ్ మరియు ఆడి ఇ-ట్రాన్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

చైనాలో తన స్థానాన్ని పటిష్టపరుచుకునేందుకు వోక్స్వ్యాగన్ చేస్తున్న ప్రణాళికల్లో భాగంగానే జెఎసి సంస్థతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుందనే వాదన బలంగా ఉంది. జెఏసి మాత్రమే కాకుండా ఎస్ఐఎసి మరియు ఎఫ్ఏడబ్ల్యూ వంటి ఆటోమొబైల్ దిగ్గజాలతో ఉమ్మడి భాగస్వామ్యపు ఒప్పందానికి దిగుతున్నట్లు తెలిసింది.

2020 నాటికి చెనైలో ఏడాదికి 4,00,000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. చైనాలో వాతావరణ కాలుష్య పరమైన చట్టాల్లో వచ్చిన మార్పులు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలకు మరింత ఊతమయ్యాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








