300 రకాల ఎలక్ట్రిక్ కార్లతో ప్రపంచపు అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల సంస్థగా అవతరించనున్న వోక్స్వ్యాగన్
2030 నాటికి వోక్స్వ్యాగన్ మరియు తమ ఇతర బ్రాండ్లలో 300 రకాల ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి ప్రపంచపు అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించనున్న వోక్స్వ్యాగన్.
భవిష్యత్ రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతోందని ఊహించుకుంటే, హైపర్ లూప్ రవాణా మార్గాలు, బుల్లెట్ రైళ్లు మరియు సిటి రవాణా కోసం మెట్రో రైళ్లు అదే విధంగా వ్యక్తిగత ప్రయాణ అవసరాల కోసం విద్యుత్తో నడిచే ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్లు మదిలో మెదులుతాయి.

నిజమే, ఇప్పటికే చాలా దేశాలు ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు మరియు టూ వీలర్ల వినియోగించే దిశగా మార్పులు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ మరియు డీజల్ లతో నడిచే వాహనాలు రవాణా వ్యవస్థ నుండి శాశ్వతంగా దూరం కానున్నాయి.

మరి పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను తయారు చేసే కంపెనీల పరిస్థితి ఏమిటని చూస్తే, అవి కూడా ఎలక్ట్రిక్ కార్ల మీద ప్రయోగాలు ముమ్మరం చేస్తూ భవిష్యత్తులో జరిగే మార్పులను ఎదుర్కోవడానికి సిద్దమవుతున్నాయి. అందుకే, ప్రతి ప్యాసింజర్ కార్లు మరియు బైకుల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేస్తున్నాయి.
Recommended Video


తాజాగా జర్మనీలో జరుగుతున్న 2017 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. అందులో ఎలక్ట్రిక్ కార్లు మరింత ప్రత్యేకతను సంతరిచుకుని సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

2017 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ప్యాసింజర్ కార్ల ప్రపంచాన్ని శాసిస్తున్న జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ అధునాతన ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. ఇదే వేదిక మీద వోక్స్వ్యాగన్ చైర్మన్ మ్యాథిస్ ముల్లర్ ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుతూ తమ భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు.

2025 నాటికి వోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ కార్ల విభాగం, విద్యుత్తో నడిచే 80 కి పైగా కొత్త మోడళ్లను ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముల్లర్ వెల్లడించాడు. ఇందులో 50 రకాల కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్తో నడేచివి కాగా, 30 వరకు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉండనున్నాయి.

2025 నాటికి వోక్స్వ్యాగన్ వద్ద ఉన్న ప్రతి నాలుగు మోడళ్లలో ఒకటి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కారు ఉంటుందని వోక్స్వ్యాగన్ పేర్కొంది. ఇది పూర్తి స్థాయిలో అమలైతే, ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 30 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే దశకు వోక్స్వ్యాగన్ చేరుకోనుంది.

2030 లోపు వోక్స్వ్యాగన్ లైనప్లో ఉన్న అన్ని మోడళ్లను ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వేరియంట్లో పరిచయం చేయనుంది. అంతే కాకుండా, వోక్స్వ్యాగన్ గ్రూపులో భాగంగా ఉన్న ఇతర కార్ల సంస్థలు విక్రయించే అన్ని కార్లను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు వోక్స్వ్యాగన్ స్పష్టం చేసింది. ఇదే నిజమైతే, వోక్స్వ్యాగన్ గ్రూపు కంపెనీల్లో ఉన్న దాదాపు 300 కార్లు ఎలక్ట్రిక్ వెర్షన్లో లభించనున్నాయి.

పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. నిజమే, భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల మీద రీసెర్చ్ మరియు అభివృద్ది కోసం వోక్స్వ్యాగన్ సుమారుగా 23.9 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడిని ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది కోసం రెండు కొత్త ఫ్లాట్ఫామ్ లను మరియు ఛార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాల కోసం వినియోగించనుంది.

ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలంటే ఎకో-ఫ్రెండ్లీ కార్లకు పవర్ సరఫరా చేయడం ప్రాథమిక సవాలుగా ఉంది. 2025 నాటికి 150 గిగావాట్ వార్షిక సామర్థ్యం గల బ్యాటరీల అవసరం ఉంటుందని వోక్స్వ్యాగన్ అంచనా వేస్తోంది.

డ్రైవ్స్పార్ తెలుగు అభిప్రాయం!
2025 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించడానికి వోక్స్వ్యాగన్ నిర్ణయించుకుంది. వోక్స్వ్యాగన్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కార్ల తయారీ సంస్థలను సొంతం చేసుకుంది. ఈ జర్మన్ దిగ్గజం ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మీద దృష్టి పెడితే, ఇతర కంపెనీల కార్లు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో లభ్యం కానున్నాయి.
వోక్స్వ్యాగన్ తీసుకొన్న నిర్ణయం ప్రపంచ రవాణా వ్యవస్థనే మరికొన్నేళ్లలో మార్చేయనుంది.


Click it and Unblock the Notifications








