హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ విడుదల ఖరారు
హ్యుందాయ్ మోటార్స్ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి సరికొత్త కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ జూలై 09న ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో విడుదల కానుంది. కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీగా కోనా కారును సిద్దం చేసింది. ఈ మోడల్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఇండియా ఎంతోకాలంగా కోనా ఎలక్ట్రిక్ కారును దేశీయంగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2019 బడ్జెట్లో ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది, తయారీ మరియు సేల్స్ ప్రోత్సహించేందుకు ఫేమ్ స్కీమ్ ఫేజ్ 2 క్రింద సుమారుగా రూ. 10,000 కోట్లు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో ఉన్న అవకాశాలను చేజిక్కుంచుకోవడానికి హ్యుందాయ్ సంస్థకు మంచి తరుణం. ఈ నేపథ్యంలోనే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోనా ఎస్యూవీని ఈ జూలై 09 న విపణిలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

హ్యుందాయ్ కోనా ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో లభించే మరే ఇతర ఎస్యూవీలతో పోల్చుకున్నా డిజైన్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక కొత్త డిజైన్ సరళిలో ప్రపంచ స్థాయి డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, ఫీచర్లు ఇంకా ఎన్నో దీని సొంతం. అదీ కూడా పెట్రోల్, డీజల్ కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుండటం దీని మరో ప్రత్యేకత.

హ్యుందాయ్ కోనా ఫ్రంట్ డిజైన్లో పూర్తిగా క్లోజ్ అయిపోయిన ఫ్రంట్ గ్రిల్ మరియు బానెట్, ట్విన్ హెడ్లైట్ డిజైన్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పగటిపూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, వెనుక వైపున ఆకర్షణీయమైన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 17-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ వంటివి ఎక్ట్సీరియర్లో ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.

హ్యుందాయ్ కోనా ఇంటీరియర్ విషయానికి వస్తే, 7-అంగుళాల పరిమాణంలో ఉన్న డిజిటల్ క్లస్టర్, 8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పెడల్ షిఫ్టర్ (రీజనరేటివ్ బ్రేకింగ్ కంట్రోల్), ఎలక్ట్రానిక్ గేర్షిఫ్ట్ బటన్ ఇంకా అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు దీని సొంతం.

అంతర్జాతీయ విపణిలో ఉన్న కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ 39.2 kWh మరియు 64.0 kWh సామర్థ్యం ఉన్న రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. రెండింటిలోనూ పర్మినెంట్-మ్యాగ్నెట్ సంక్రోనష్ మోటార్ కలదు. రెండు వేరియంట్లు కూడా ఒక్కసారి ఛార్జింగ్తో 312కిమీలు మరియు 482కిమీల మైలేజ్ ఇస్తాయి.

ఈ రెండు వేరియంట్లలో భారత్ మార్కెట్కు ఖరారు చేసిన వేరియంట్ ఏదో ఇంకా స్పష్టం కాలేదు. 39.2 kWh లేదా 64.0 kWh ఈ రెండింటిలో ఖచ్చితంగా ఏదో ఒక మోడల్ అతి త్వరలో పరిచయం కానుంది. పూర్తి స్థాయిలో విడుదలైతే అంచనా ప్రకారం సుమారుగా రూ. 25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను కలిగి ఉండవచ్చు.

ఇటీవల విడుదలైన సేల్స్ రిపోర్ట్ ప్రకారం హ్యుందాయ్ ఇండియా ప్యాసింజర్ కార్ల సేల్స్ 3.2 శాతం పడిపోయాయి. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన వెన్యూ కాంపాక్ట్ ఎస్యూవీ అత్యుత్తమ ఫలితాలు కనబరిచింది. నిజానికి ఈ మోడల్ కారణంగానే స్వల్ప నష్టంతోనే గట్టెక్కింది.


Click it and Unblock the Notifications








