జనవరిలో 'లగ్జరీ' మోత: పెరగనున్న బిఎమ్డబ్ల్యూ, మినీ కార్ల ధరలు
పాత (2020) సంవత్సరంలో కస్టమర్లను కరోనా కుదిపేయగా, కొత్త (2021) సంవత్సరంలో పెరగబోయే ధరలతో కొనుగోళ్లు మరింత భారంగా మారనున్నాయి. వచ్చే నెలలో భారత మార్కెట్లో తమ మొత్తం ఉత్పత్తి శ్రేణి ధరలను పెంచుతున్నట్లు బిఎమ్డబ్ల్యూ ఇండియా ప్రకటించింది.

భారతదేశంలో బిఎమ్డబ్ల్యూ మరియు దాని సబ్ బ్రాండ్ మినీ విక్రయించే అన్ని కార్ల ధరలు 2 శాతం మేర పెరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 4, 2021వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని బిఎమ్డబ్ల్యూ తెలిపింది.

ఇప్పటి వరకూ ధరల పెంపును ప్రకటించిన ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే, బిఎమ్డబ్ల్యూ గ్రూప్ ఇండియా కూడా పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను తగ్గించడానికే ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్లను బట్టి ధరల పెరుగుదల మారుతూ ఉంటుంది.

బిఎమ్డబ్ల్యూ ఇండియా, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పలు రకాల ఉత్పత్తులను అందిస్తుంది. ఇందులో భారతదేశంలోనే ఉత్పత్తి చేయబడిన అనేక మోడళ్లు, సిబియు యూనిట్ల ద్వారా దిగుమతి చేసుకునే మోడళ్లు కూడా ఉన్నాయి.

బిఎమ్డబ్ల్యూ ఇండియా ప్రోడక్ట్ లైనప్లో 2 సిరీస్ జిసి, 3 సిరీస్, 3 సిరీస్ జిటి, 5 సిరీస్, 6 సిరీస్ జిటి, 7 సిరీస్, ఎక్స్ 1, ఎక్స్ 3, ఎక్స్ 4, ఎక్స్ 5 మరియు ఎక్స్ 7 వంటి మోడళ్లను కంపెనీ స్థానికంగానే ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కాకుండా, 8 సిరీస్ జిసి, ఎక్స్ 6, జెడ్ 4, ఎమ్ 2 కాంపిటీషన్, ఎమ్ 5 కాంపిటీషన్, ఎమ్ 8 కూపే, ఎక్స్ 3 ఎమ్ మరియు ఎక్స్ 5 ఎమ్ వంటి మోడళ్లను కూడా సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

బిఎమ్డబ్ల్యూ సబ్ బ్రాండ్కి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ భారత్లో కేవలం ఒకే ఒక మోడల్ని మాత్రమే స్థానికంగా ఉత్పత్తి చేస్తోంది, అదే మినీ కంట్రీమాన్. ఇకపోతే, ఈ బ్రాండ్ సిబియూ మార్గం ద్వారా మినీ 3-డోర్, 5-డోర్, మినీ కన్వర్టిబల్, క్లబ్మ్యాన్ మరియు జెసిడబ్ల్యూ హ్యాచ్ వంటి మోడళ్లను దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

ధరల పెంపు గురించి బిఎమ్డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ, అపూర్వమైన కొత్త సంవత్సరంలో, బిఎమ్డబ్ల్యూ గ్రూప్ ఇండియా తన గౌరవప్రదమైన ఖాతాదారులకు అత్యుత్తమమైన ఉత్పత్తులను మరియు అసమానమైన సేవలను అందించడంపై దృష్టి పెట్టిందని, పెరుగుతున్న వ్యయాలను తగ్గించేందుకు ధరలను పెంచక తప్పడం లేదని అన్నారు.

కస్టమర్ సంతృప్తి, డీలర్ లాభదాయకత మరియు స్థిరమైన వృద్ధి వంటి విజయవంతమైన వ్యాపారం యొక్క ప్రాథమిక అంశాలను బలోపేతం చేసేలా జనవరి 4, 2021వ తేదీ నుండి, బిఎమ్డబ్ల్యూ మరియు మినీ పోర్ట్ఫోలియోలోని ఉత్పత్తులను ధరలను స్వల్పంగా 2 శాతం మేర పెంచుతున్నామని ఆయన చెప్పారు.

బిఎమ్డబ్ల్యూ బ్రాండ్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే భారత మార్కెట్లో సరికొత్త బిఎమ్డబ్ల్యూ 2-సిరీస్ గ్రాన్ కూపే బ్లాక్ షాడో ఎడిషన్ను విడుదల చేసింది. మార్కెట్లో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.42.30 లక్షలుగా ఉంది.

బిఎమ్డబ్ల్యూ 2-సిరీస్ గ్రాన్ కూపే బ్లాక్ షాడో ఎడిషన్లో 2.0-లీటర్, 4-పాట్ ట్విన్ పవర్ టర్బో డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 1,750 మరియు 2,500 ఆర్పిఎమ్ మధ్య 187 బిహెచ్పి పవర్ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతజేయబడి ఉంటుంది. - ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








