కోవిడ్-19 కారణంగా ప్రజా రవాణా పరిశ్రమలో 20 లక్షల ఉద్యోగాలు పోయాయ్: బిసిఓసిఐ
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ప్రజలు ఉద్యోగాలను కోల్పోతున్నారు, లక్షల సంఖ్యలో కుటుంబాలు పనుల్లేక రోడ్డున పడుతున్నాయి. కోవిడ్-19 కారణంగా మన దేశంలో సుమారు 20 లక్షల మంది ఉపాధిని కోల్పోయినట్లు బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిసిఓసిఐ) ప్రకటించింది. వీరికి అదనంగా మరో 20 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోవచ్చని బిసిఓసిఐ ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలో 11 లక్షల పర్యాటక టాక్సీలు, 15 లక్షల బస్సులు నడుపుతున్న 20,000 మందికి పైగా ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా సుమారు ఒక కోటి మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, రెండు నెలల లాక్డౌన్, కొనసాగుతున్న కోవిడ్-19 విజృంభనల కారణంగా వారు ఉపాధి కోల్పోతున్నారని, ప్రస్తుతం ఈ ఆపరేటర్లకు ప్రభుత్వం నుండి మద్దతు అవసరం అని బిసిఒసిఐ తెలిపింది.

అనేక మంది బస్సు మరియు టూరిస్ట్ టాక్సీ ఆపరేటర్లు నిధుల కొరత కారణంగా దుకాణాన్ని మూసివేసే పనిలో ఉన్నారు. వ్యాపారం లేక ఈ ఆపరేటర్లు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు పన్నులు మరియు రుణాలపై వడ్డీలను మినహాయింపులు చేయాల్సిన అవసరం ఉందని బిసిఒసిఐ పేర్కొంది.

లాక్డౌన్ సమయంలో 90 శాతం బస్సులు మరియు టూరిస్ట్ టాక్సీలు పనిలేకుండా ఖాళీగా ఉన్నాయని, ఈ సమయంలో పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సు ఆపరేటర్లకు కంపెనీ కాంట్రాక్టులు ఉండగా మరికొన్ని వలస కార్మికులను తరలించేందుకు ఉపయోగించబడ్డాయని బిసిఒసిఐ తెలిపింది.

బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రసన్న పట్వర్ధన్ మాట్లాడుతూ, కొనసాగుతున్న కోవిడ్-19 కారణంగా కనీసం 1 కోటి మందిలో 30-40 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇప్పటికే 15-20 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు. మిగిలిన వారు త్వరలోనే వారి ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.

వచ్చే సెప్టెంబర్ నుండి, ఒకసారి రుణాలపై ఆర్బిఐ ప్రకటించిన మారటోరియం పూర్తయిన తర్వాత ఆపరేటర్లు తమ ఈఎమ్ఐలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని, అది కష్టతరంగా మారుతుందని ఆయన చెప్పారు.
ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సిన అసరం ఉందని కాన్ఫెడరేషన్ కోరింది. మోటారు వాహన పన్నులపై మాఫీ, ఇంటర్ సిటీ ప్రయాణాలపై దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ రైడ్లను ఆఫర్ చేయటం మరియు డీజిల్ ధరలపై రాయితీలను ఇవ్వటం వంటివి చేయాలని బిసిఒసిఐ ప్రభుత్వాన్ని కోరింది.

వాహన బీమా పాలసీల కాలపరిమితిని కూడా కనీసం మరో మూడు నెలల పాటు పొడిగించాలని బిసిఒసిఐ కోరింది. సంవత్సరానికి ఒక వాహనానికి అయ్యే భీమా ఖర్చు సుమారు రూ .50,000 నుండి 2 లక్షల మధ్యలో ఉంటుందని కాన్ఫెడరేషన్ గుర్తు చేసింది.
వాహన రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని కూడా పట్వర్ధన్ ప్రభుత్వాన్ని కోరారు. మూడు నుంచి ఆరు నెలల మధ్య బ్యాంకులు వడ్డీని మాఫీ చేయాలని, తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీని వసూలు చేయరాదని ఆయన అన్నారు.

వచ్చే సెప్టెంబరు నుండి, ఈఎమ్ఐ చెల్లింపులు పునఃప్రారంభం అవుతాయని, అయితే వ్యాపారాలు మాత్రం వెంటనే ప్రారంభం కావని, అవి సాధారణ స్థితికి చేరుకోవటానికి మరికొంత కాలం పట్టవచ్చని పట్వర్ధన్ చెప్పారు. కాబట్టి ఈ విషయంలో రుణాల రీషెడ్యూలింగ్ కూడా అంతే ముఖ్యమైనదని, ఈ నేపథ్యంలో ఆపరేటర్లు ప్రారంభంలో ముందుగా తక్కువ ఈఎమ్ఐలను వసూలు చేస్తూ, వ్యాపారం జోరందుకున్నాక ఈఎమ్ఐలను పెంచేలా 'బెలూనింగ్ తరహా' ఈఎమ్ఐలను ఆఫర్ చేయాలని చెప్పారు.

ఆపరేటర్లకు సులువుగా ఉండేందుకు వీలుగా బ్యాంకులు ప్రస్తుత రుణాల కాలపరిమితిని మరో 12 నెలల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని, 'వన్ నేషన్, వన్ టాక్స్' కోసం తాము దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ను కూడా ఈ సందర్భంగా కాన్ఫెడరేషన్ పునరుద్ఘాటించింది. ఈ విషయాల్లో కొన్ని నిర్మాణాత్మక సంస్కరణలు చేయటానికి ఇదే సరైన సమయం అని పట్వర్ధన్ అన్నారు.

కోవిడ్-19 ప్రభావితమైన ఇతర రంగాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తున్నప్పటికీ, ప్రజా రవాణా పరిశ్రమను మాత్రం నిర్లక్ష్యం చేసిందని బిసిఒసిఐ అభిప్రాయపడింది. ఈ లాక్డౌన్ ప్రయాణీకుల రవాణా సంస్థలపై ప్రతికూల ఆర్థిక ప్రభావాలను చూపింది. ఈ రంగానికి భద్రత మరియు సామాజిక దూరానికి సంబంధించి సరైన మార్గదర్శకాలు లేనందున ఆపరేటర్లు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంపై నెలకొన్ని అనిశ్చితిపై ఆందోళన చెందుతున్నారు.

బిసిఒసిఐ స్టేట్మెంట్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
నిజానికి ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. కోవిడ్-19 కారణంగా దేశంలో రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో రవాణా పరిశ్రమకు ప్రభుత్వం వెంటనే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








