ఇలా అయితే ఆగస్ట్ 1 నుంచి బస్ సర్వీసులు నిలిపివేస్తాం!
కేరళ రాష్ట్ర ప్రైవేట్ బస్ ఆపరేటర్ల సమాఖ్య ఆగస్టు 1 నుంచి రాష్ట్ర రహదారులపై కార్యకలాపాలను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. లాక్డౌన్ కారణంగా గత కొంత కాలంగా ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోవటంతో పాటుగా ప్రభుత్వం నుండి తమ ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవలసి వస్తుందోని ఫెడరేషన్ పేర్కొంది.

కోవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ప్రైవేట్ వాహన రంగం గురించి తాము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నామని, ఇటు వంటి కష్ట కాలంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినట్లయితే, ఇకపై బస్ సర్వీసులు నడపడం ఆర్థికంగా సాధ్యం కాదని ఆపరేటర్లు తెలిపారు.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఛార్జీల పెరుగుదల కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోయిందని, ఈ నిర్ణయం వలన నష్టాలు మరింత పెరిగాయని కేరళ రాష్ట్ర ప్రైవేటు బస్ ఆపరేటర్ల సమాఖ్య పేర్కొంది.
ఈ విషయంపై కేరళ స్టేట్ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఫెడరేషన్ చైర్మన్ లారెన్స్ బాబు మాట్లాడుతూ, "ప్రైవేట్ బస్ పరిశ్రమ పరిస్థితి దాని చరిత్రలోనే ఇదివరకెన్నడూ లేనతం ఘోరంగా ఉంది. ఛార్జీల పెరుగుదల, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా కలెక్షన్ తగ్గిపోయాయి."

"మే 19 నాటికి బస్సులు తిరిగి సేవలను ప్రారంభించినప్పటికీ, అప్పటి నుండి 20 శాతం కూడా ప్రైవేట్ బస్సులు కూడా రోడ్లపైకి రాలేదు. ఆ తరువాత ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కోవిడ్-19 వ్యాప్తి భయం కారణంగా చాలా మంది బస్సుల్లో ప్రయాణించడానికి సిద్ధంగా లేర"ని ఆయన చెప్పారు.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా లాభాలు తగ్గి నష్టాలను విపరీతంగా పెంచాయని ఫెడరేషన్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీని ప్రకటించి పరిశ్రమ పునరుద్ధరించడానికి సహాయపడుతుందని తాము ఆశిస్తున్నామని ఫెడరేషన్ పేర్కొంది.
రోడ్ టాక్స్ రూపంలో కొంత మూలధనాన్ని ఆదా చేయాలనే ఆశతో ఆయా ఆర్టీపీ కార్యాలయాల వద్ద జి-ఫారం సమర్పించే పనిలో ఉన్నట్లు రాష్ట్రంలోని ప్రైవేట్ బస్ ఆపరేటర్లు తెలిపారు.

దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ బస్ ఆపరేటర్లు కూడా తమ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని పేర్కొంటున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య వాహనాలకు పన్ను విధించడాన్ని ఇటీవల మినహాయింపు ప్రకటించింది, కానీ ఈ పన్ను మినహాయింపు నుంచి ఎయిర్ కండిషన్ లేని ప్రైవేట్ బస్సులను వదిలివేసింది.

కేరళ బస్ ఆపరేటర్ల వ్యాఖ్యలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
నిజానికి కేరళలోనే యావత్ భారతదేశంలో ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 కారణంగా ప్రైవేట్ రవాణా చాలా వరకూ స్థంభించిపోయింది. బస్ ఆపరేటర్లు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








