మహీంద్రా ఆటమ్ క్వాడ్రిసైకిల్ టీజర్ లాంచ్ - వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల
మహీంద్రా ఎలక్ట్రిక్ ఇటీవలే వాణిజ్య వినియోగం కోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించినట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. రానున్న రోజుల్లో భారత మార్కెట్ కోసం పలు ఈవీ (ఎలక్ట్రిక్ వాహనం)లను విడుదల చేయడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. మహీంద్రా ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ కూడా ఇందులో ఒక భాగంగా ఉంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ 2020 ఆటో ఎక్స్పోలో తమ ఆటమ్ నాలుగు చక్రాల వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. అంతేకాకుండా, ఆటో ఎక్స్పో ఏరియా లోపల సందర్శకులను తీసుకెళ్లడానికి కూడా ఈ వాహనాలను ఉఫయోగించారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో మహీంద్రా ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ను మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి మరియు అంతకు ముందు దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా విధించిన లాక్డౌన్ కారణంగా భారత మార్కెట్లో అనేక మోడళ్ల విడుదలలు జాప్యం అయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి.
వాస్తవానికి మహీంద్రా ఆటమ్ కూడా ఈ ఏడాది మార్కెట్లోకి రావల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. లాస్ట్-మైల్ కనెక్టివిటీ వెహికల్గా మరియు ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా తాజాగా తమ ఆటమ్ సామర్థ్యాలను, ఫీచర్లను తెలియజేసే టీజర్ వీడియోని విడుదల చేసింది.

మహీంద్రా ఆటమ్ మొత్తం కొలతల పరంగా పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ విశాలమైన క్యాబిన్ను కలిగి ఉండేలా తయారు చేశారు. టాల్ రైడింగ్ డిజైన్ ఫీచర్ను ఈ వీడియో హైలైట్ చేస్తుంది. రిక్లైనింగ్ సీటు సహాయంతో ఇది గరిష్ట సౌకర్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ టీజర్ వీడియోలో ఆటమ్ యొక్క పెద్ద విండో ప్యానెళ్లను కూడా హైలైట్ చేశారు. ఇది మంచి ఎయిరీ ఫీల్ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఫ్లాట్ ఫ్లోర్ మరియు పెద్ద తలుపులు ఉన్నందున ఇందులో లగేజ్ లోడ్ చేయడం/అన్లోడ్ చేయడం చాలా సులభమని కంపెనీ తెలిపింది.

ఇవే కాకుండా, ఆటో ఎక్స్పోలో కంపెనీ తమ ఆటమ్ ప్రోటోటైప్ మోడల్ను ఆవిష్కరించినప్పుడు మేము ఇందులో మరికొన్ని ఫీచర్లను గమనించాము. ఇందులో మొబైల్ ఫోన్ హోల్డర్, ఎయిర్-కాన్ వెంట్స్, డ్రైవర్తో సహా ముగ్గురు ప్రయాణీకుల కోసం సౌకర్యవంతమైన సీటింగ్, విండోస్ కోసం వైండ్-అప్ రోలర్ హ్యాండిల్స్ మరియు ఆసక్తికరమైన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వెనుక ప్రయాణీకుల వినోదం కోసం పెద్ద టచ్స్క్రీన్ను కూడా ఇందులో జోడించారు.

ఆవిష్కరణ సమయంలో ఆటమ్ యొక్క ఖచ్చితమైన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయినప్పటికీ, ఇది యాంత్రికంగా నియంత్రించబడిన టాప్ స్పీడ్ 70 కిలోమీటర్ల వేగంతో 15 కిలోవాట్ల కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ను కలిగి ఉంటుందని అంచనా.

మహీంద్రా ఆటమ్ మార్కెట్లో విడుదలైన అయిన తర్వాత ఇది ఈ సెగ్మెంట్లో బజాజ్ ఆటో నుంచి రానున్న బజాజ్ క్యూట్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్కు పోటీగా నిలుస్తుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ బ్రాండ్ యొక్క అన్ని తక్కువ వోల్టేజ్ మోడళ్లను ఉత్పత్తి చేసే బెంగళూరులోని కంపెనీ ప్లాంట్లోనే ఆటమ్ కూడా అసెంబుల్ కానుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ఫోలియో అభివృద్ధికి ఇటీవల అనేక పెట్టుబడులను ప్రకటించింది. ఇందులో క్వాడ్రిసైకిళ్ల అభివృద్ధి కోసం కంపెనీ రూ.150 కోట్లను, బెంగళూరు ప్లాంట్లో కొత్త అసెంబ్లీ లైన్ కోసం రూ.250 కోట్లను, బెంగళూరు కేంద్రంగా ఉన్న తన ఆర్ అండ్ డి కేంద్రానికి మరో రూ.500 కోట్లను పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

మహీంద్రా ఆటమ్ క్వాడ్రిసైకిల్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
మహీంద్రా ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఎక్కువగా ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి రానుంది. ట్రెడిషనల్ ఆటోరిక్షాల స్థానాన్ని భర్తీ చేయటంలో ఇది చక్కగా పనిచేసే అవకాశం ఉంది. ఇది రద్దీగా ఉండే నగర వీధుల్లో ప్రయాణీకులను తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది రైడ్ ఛార్జీలను తగ్గించడంలోనూ మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలోనూ సహకరిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, సామాజిక దూరం అవసరమయ్యే ప్రస్తుత సమయంలో ఇది వ్యక్తిగత రవాణా వాహనంగా కూడా చక్కగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








