మహీంద్రా థార్కి పోటీగా మారుతి సుజుకి జిమ్నీ; భారత్లో ఉత్పత్తి ప్రారంభం!
ఇటీవలే విడుదలైన కొత్త తరం మహీంద్రా థార్కు గట్టి పోటీనిచ్చేందుకు మారుతి సుజుకి ఇండియా కూడా మరో సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి ప్రదర్శించిన సుజుకి జిమ్నీ ఎస్యూవీ అసెంబ్లింగ్ ప్రక్రియను కంపెనీ గుర్గావ్ ప్లాంట్లో ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తుంటే, త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మారుతి సుజుకి ఇండియా ఇటీవలే తమ కొత్త సుజుకి జిమ్నీ ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేయటమే కాకుండా, ఈ మోడల్ ఉత్పత్తిని పూర్తిగా భారతదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్ను 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ ప్రొడక్షన్ హబ్గా మార్చాలని జపాన్కు చెందిన సుజుకి కార్పోరేషన్ భావిస్తోంది.

తాజాగా.. టీఎమ్ బిహెచ్పి నుండి వచ్చిన నివేదికల ప్రకారం, కంపెనీకి చెందిన గుర్గావ్ ప్లాంట్లో ఇప్పటికే సుజుకి జిమ్నీ అసెంబ్లీ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కంపెనీ రికార్డుల ప్రకారం, ఇప్పటికే ఈ ఆఫ్-రోడర్ ఎస్యూవీ మొదటి యూనిట్ అసెంబ్లింగ్ ప్రక్రియ కూడా పూర్తయిందని సమాచారం.

భారతదేశంలోని గుర్గావ్లో ఉన్న మారుతి సుజుకి ఇండియా ప్లాంట్లో జిమ్నీ మోడల్ను ప్రస్తుతం 4000 నుండి 5000 యూనిట్ల మేర ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యూనిట్లలో ఎక్కువ భాగం జపాన్తో సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.

ఈ ప్లాంట్లో సుజుకి తమ 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్ జిమ్నీని ఉత్పత్తి చేస్తుందని సమాచారం. అయితే, ఇందులో 3-డోర్ జిమ్నీ ఎస్యూవీలను పరిమిత సంఖ్యలో అసెంబ్లింగ్ చేయనుండగా, 5-డోర్ వెర్షన్ జిమ్నీని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయనున్నారు. భారత మార్కెట్లో 5-డోర్ వెర్షన్ జిమ్నీ విడుదల కావచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

భారత మార్కెట్లో సుజుకి జిమ్నీ విడుదలకు సంబంధించి ఇప్పటికీ స్పష్టమైన వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు. అయితే, ఇది 2021లో ఏ సమయంలో నైనా ఇక్కడి మార్కెట్లోకి రావచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది మారుతి సుజుకి ఇండియా డిస్కంటిన్యూ చేసిన జిప్సీ స్థానంలో కొత్త సుజుకి జిమ్నీ మోడల్ను ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

భారత మార్కెట్ కోసం తయారు చేయబోయే సుజుకి జిమ్నీలో అంతర్జాతీయ మోడల్తో పోలిస్తే కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. విదేశాల్లో లభిస్తున్న ఫైవ్-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ కారులో 1.5 లీటర్ కె15 పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్పి శక్తిని, 130 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్కు వచ్చే సరికి మారుతి సుజుకి తమ సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా మోడళ్లలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్నే ఇందులోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ కూడా ఇంచు మించు పైన పేర్కొన్న గణాంకాలనే ఉత్పత్తి చేయవచ్చని అంచనా. సుజుకి జిమ్నీ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఈ ఎస్యూవీని దేశవ్యాప్తంగా మారుతి సుజుకి నెక్సా ప్రీమియం అవుట్లెట్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

భారత్లో సుజుకి జిమ్నీ అసెంబ్లింగ్ ప్రారంభం కావటంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారత ఎస్యూవీ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో సుజుకి జిమ్నీ కూడా ఒకటి. ఈ ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ ఎస్యూవీ ఇప్పటికే భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన హైప్ను తెచ్చుకుంది. జీప్ తరహా వాహనాలను ఇష్టపడే అనేక మంది ఔత్సాహికులు భారత మార్కెట్లో జిమ్నీ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్కెట్లో ఈ ఎస్యూవీ ధరలు రూ.10 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా.
Source: Team-BHP


Click it and Unblock the Notifications








