మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 బుకింగ్స్ ప్రారంభం; జులై 28న విడుదల!
మారుతి సుజుకి ఇండియా తమ నెక్సా ప్రీమియం డీలర్షిప్ చైన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్న ఎస్-క్రాస్ క్రాసోవర్లో కొత్త బిఎస్6 వెర్షన్ కోసం కంపెనీ బుకింగ్లను ప్రారంభించింది. రూ.11,000 టోకెన్ అమౌంట్తో కస్టమర్లు ఈ మోడల్ను బుక్ చేసుకోవచ్చు. కొత్త మారుతి సుజుకి ఎస్-క్రాస్ జూలై 28, 2020వ తేదీన మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

కొత్త బిఎస్6 మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాస్ఓవర్లో సుజుకి నుండి పాపులర్ అయిన 1.5-లీటర్ ‘ఎస్హెచ్విఎస్' స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించనున్నారు. ఈ 1.5 లీటర్, ఫోర్ సిలిండర్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడి ఉండొచ్చని సమాచారం.

ఈ కొత్త మోడల్ విడుదల సమయంలో కంపెనీ హై-స్పెక్ వేరియంట్లపై ఆప్షనల్ ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను ఆఫర్ చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మునుపటి వెర్షన్తో పోల్చుకుంటే, ఈ కొత్త బిఎస్6 మోడల్లో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో కొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం.

బిఎస్6 ఎస్-క్రాస్ మోడల్ గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లోని మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "నెక్సా పోర్ట్ఫోలియోలో ఎస్-క్రాస్ ప్రధాన ఉత్పత్తిగా ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది మరియు దాని ప్రీమియం ఇంటీరియర్స్, స్టైలిష్ అండ్ మజిక్యులర్ డిజైన్ కారణంగా ఇప్పటికే అది 1.25 లక్షల మంది వినియోగదారుల ప్రశంశలను పొందింద"ని అన్నారు.

"ఎస్-క్రాస్ బిఎస్6 పెట్రోల్ వెర్షన్ కోసం బుకింగ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించేందుకు మేము సంతోషిస్తున్నాము. మా నిరంతరాయ ఆవిష్కరణలతో, ఎస్-క్రాస్ పెట్రోల్ మా వినియోగదారుల విశ్వాసానికి మరియు నమ్మకానికి మరో నిదర్శనంగా నిలుస్తుందని మేము ఆశాభావంతో ఉన్నామ"ని ఆయన చెప్పారు.

అధునాతన భద్రతా నైపుణ్యం కోసం కొత్త ఎస్-క్రాస్ మోడల్ను విస్తృతంగా పరీక్షించబడిందని బ్రాండ్ ప్రకటించింది. రోహ్తక్లోని తయారీదారుల పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంలో ఫ్రంటల్ ఆఫ్-సెట్ క్రాష్, సైడ్ ఇంపాక్ట్ మరియు పాదచారుల భద్రతకు సంబంధించిన అన్ని పరీక్షలను ఈ మోడల్కు నిర్వహించినట్లు పేర్కొంది.

ఎమ్ఎస్ఐఎల్ సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తమ నెక్సా డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా 11 లక్షలకు పైగా వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. గత 2015లో ప్రారంభించిన నెక్సా బ్రాండ్ ప్రీమియం మారుతి కార్లను మాత్రమే విక్రయిస్తుంది. సాధారణ మారుతి సుజుకి కార్లు అరెనా బ్రాండ్ ద్వారా విక్రయిస్తోంది.

మారుతి సుజుకి బ్రాండ్ ప్రకటించిన వివరాల ప్రకారం, తమ వినియోగదారులలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపువారని, మరియు వారంతా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారని తెలిపింది. ఈ కొత్త తరం వినియోగదారుల అవసరాలను తీర్చడానికి మారుతి సుజుకి తమ నెక్సా నెట్వర్క్ను సృష్టించింది.

మారుతి తమ నెక్సా డీలర్షిప్ నెట్వర్క్ ఇప్పుడు దేశంలో మూడవ అతిపెద్ద నెట్వర్క్గా ఉందని, తమకు దేశవ్యాప్తంగా 370 డీలర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. నెక్సా బ్రాండ్ క్రింద ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎస్-క్రాస్ మరియు ఎక్స్ఎల్6 మోడళ్లను ఎక్స్క్లూజివ్ నెక్సా డీలర్షిప్ల ద్వారా విక్రయిస్తున్నారు.

2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 క్రాసోవర్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
కొత్త వాహనాలకు బుకింగ్లను ప్రారంభించడం, అమ్మకాలు సజావుగా సాగుతుండటంతో ఆటో పరిశ్రమకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎస్-క్రాస్ బిఎస్6 మోడల్ విడుదల ఆలస్యం అయింది. ఎస్-క్రాస్ ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన మోడల్, ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న పెట్రోల్ ఇంజన్తో ఇది మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








