హైదరాబాద్, పూనేలలో మారుతి సుజుకి 'చందా' ప్లాన్ ప్రారంభం; వివరాలు
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) భారత మార్కెట్లో తమ వాహనాల కోసం సభ్యత్వ ఆధారిత యాజమాన్యాన్ని (సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఓనర్షిప్) ప్రారంభించింది. ఈ సేవలు ఇప్పుడు పూణే మరియు హైదరాబాద్ నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మైల్స్ టెక్నాలజీస్తో మారుతి సుజుకి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

కస్టమర్లు సులువుగా మారుతి సుజుకి వాహనాలను సొంతం చేసుకోవడానికి కొత్త మరియు సులభమైన మార్గాన్ని అందించేందుకు ఈ ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఇప్పటికే గుర్గావ్, బెంగళూరు నగరాల్లో ‘మారుతి సుజుకి సబ్స్క్రయిబ్' సేవలను అందిస్తోంది.

కారును నేరుగా కంపెనీ నుండి కొనుగోలు చేయకుండా, కారును సొంతం చేసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను అనుభవించాలనుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ సబ్స్క్రయిబ్ ప్రోగ్రామ్ను పరిచయం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కారును దీర్ఘకాలం పాటు లీజుకు తీసుకోవటం లాంటిదే అన్నమాట.

ఈ చందా విధానం ద్వారా కారును లీజుకు తీసుకున్న కస్టమర్లు డౌన్పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. మారుతి సుజుకి అరేనా షోరూమ్లు మరియు నెక్సా డీలర్షిప్ల ద్వారా కంపెనీ ఈ చందా ఆధారిత స్కీమ్ను అందిస్తోంది.

ఈ స్కీమ్ క్రింద మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ మరియు ఎక్స్ఎల్6 మొదలైన వాహనాలు ఉన్నాయి. వినియోగదారులు చందా పదవీకాలం కోసం 12, 18, 24, 30, 36, 42 మరియు 48 నెలల వ్యవధిలలో వారికి నచ్చిన కాల పరిమితిని ఎంచుకోవచ్చు.

ఈ చందా సేవల కోసం వసూలు చేసే ధరలను గమనిస్తే, ఉదాహరణకు పూణేలోని స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ను లీజుకు తీసుకుంటే నెలకు అన్ని పన్నులతో కలిపి రూ.17,600 చెల్లించాల్సి ఉంటుంది. అదే హైదరాబాద్ నగరంలో అయితే నెలకు రూ.18,350 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్లు ఇలా లీజుకు తీసుకున్న వాహనాలను ఎప్పటికీ సొంతం చేసుకోవాలనుకుంటే, చందా కాలం ముగిసిన తర్వాత బైబ్యాక్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.

ఈ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాన్ని ప్రకటించిన నేపథ్యంలో, మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మారుతున్న వ్యాపార విధానంలో, చాలా మంది వినియోగదారులు ప్రజా రవాణా నుండి వ్యక్తిగత కార్లకు మారాలని కోరుకుంటున్నారు. ఆర్థికంగా సులువైన మరియు దీర్ఘకాలిక ఆర్థిక కట్టుబాట్లను లేని పరిష్కారాల కోసం కస్టమర్లు వెతుకుతున్నారు."

"అలాంటి కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడినదే ఈ మారుతి సుజుకి సబ్స్క్రయిబ్ ప్లాన్. ఇది మారుతున్న కస్టమర్ల అవసరాలను తీరుస్తుంది. మా కొత్త సమర్పణ చాలా మంది కొత్త కస్టమర్లను బ్రాండ్కు పరిచయం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని" ఆయన అన్నారు.

మారుతి సుజుకి చందా సేవలో కస్టమర్లకు జీరో-డౌన్ పేమెంట్, ఫుల్ కార్ మెయింటినెన్స్, ఇన్సూరెన్స్, 24x7 రోడ్సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అంతేకాదు, కస్టమర్లకు రీసేల్ రిస్క్ కూడా ఉండదు. మారుతి సుజుకి డీలర్ ఛానల్ ద్వారా వాహనాల నిర్వహణ, భీమా కవరేజ్ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను మైల్స్ కంపెనీ చూసుకుంటుంది.

ఈ భాగస్వామ్యంపై మైల్స్ వ్యవస్థాపకుడు మరియు సిఈఓ ఎమ్ఎస్ సాక్షి విజ్ మాట్లాడుతూ, మారుతి సుజుకి భారత మార్కెట్లో మార్గదర్శకురాలిగా ఉంది మరియు మారుతి సుజుకి సబ్స్క్రయిబ్ ప్రోగ్రామ్ కింద కారును చందా సేవలను అందించడానికి వారితో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాము. భారతీయ మార్కెట్లో సులభమైన వాహన యాజమాన్య పరిష్కారాల యొక్క మా లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని మేము ధీమాగా ఉన్నామ"ని అన్నారు.

మారుతి సుజుకి సబ్స్క్రిప్షన్ ప్లాన్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజా రవాణా నుంచి వ్యక్తిగత రవాణాకి మారాలని చూస్తున్న కస్టమర్ల కోసం మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఈ కొత్త చందా పథకం క్రింద వారు తమ కొత్త వాహనాన్ని సొంతం చేసుకోవడం మరింత సులభతరం కానుంది. ఈ చందా పథకం క్రింద కారును కొనుగోలు చేసే కస్టమర్లు డౌన్పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి విషయాల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.


Click it and Unblock the Notifications