ఒకేసారి 14 కొత్త కార్లను ఆవిష్కరిస్తున్న ఎంజీ మోటార్
ఎంజీ మోటార్ ఇండియా ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వేదికగా జరగబోయే 2020 ఆటో ఎక్స్పో వాహన ప్రదర్శనలో తమ ఫ్యూచర్ మోడళ్లను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్, ఎలక్ట్రిక్ మరియు అటానమస్ కార్ల కోసం అభివృద్ధి చేసిన అత్యాధునిక టెక్నాలజీని కూడా పరిచయం చేయనున్నారు.

ఎంజీ మోటార్ స్మాల్ హ్యాచ్బ్యాక్ కార్లు, సెడాన్ కార్లు మరియు ఎస్యూవీలతో కలుపుకొని మొత్తం 14 కొత్త కార్లను ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు.. ఆటో ఎక్స్పోలో ఎంజీ మోటార్ తొలిసారి పాల్గొంటోంది.

ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎన్నో ఫ్యూచర్ టెక్నాలజీలను ఈ వేదికగా ఆవిష్కరిస్తున్నాం. నూతన ఆవిష్కరణలు, కస్టమర్ల సంతృప్తి మరియు సుస్థిర అభివృద్దే లక్ష్యంగా తమ కొత్త ఉత్పత్తులు ఉంటాయని ఎంజీ మోటార్ ఇండియా రాజీవ్ ఛబా పేర్కొన్నారు.

ఎంజీ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని జనవరి 27, 2020న విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. హెక్టార్ తర్వాత ఎంజీ దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్న రెండవ మోడల్ ఇదే. ఆరంభంలో హైబదారాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాల్లో మాత్రమే లభించనుంది.

ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్సైట్ మరియు ఎక్స్క్లూజివ్ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులోని 44.5kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ 3-ఫేస్ ఎలక్ట్రిక్ మోటార్కు పవర్ సరఫరా చేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 141బిహెచ్పి పవర్ మరియు 353ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆటోమేటిక్ గేర్బాక్స్ అనుసంధానం గల ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు స్టాండర్డ్ ఛార్జింగ్ ఆప్షన్లు వచ్చాయి. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ సింగల్ ఛార్జింగ్తో ఏకంగా 340కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎంజీ మోటార్ ఇండియా దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో అతి పెద్ద సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అతి తక్కువ సమయంలోనే వీలైనన్ని ఎక్కువ కార్లను ప్రవేశపెట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ లక్ష్యంతోనే ఏకంగా 14 కొత్త కార్లను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం ఢిల్లీ ఆటో ఎక్స్పో వేదికగా ఆవిష్కరించేందుకు సిద్దమైంది.


Click it and Unblock the Notifications








