మీ ఫాస్ట్ట్యాగ్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలా? అయితే ఇలా చేయండి!
జనవరి 1, 2021వ తేదీ నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ట్యాగ్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసినదే. అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను (క్యాష్ ట్రాన్సాక్షన్లను) పూర్తిగా నిలిపివేయాలని మరియు టోల్ ప్లాజాలా గుండా ప్రయాణించే అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

అయితే, ప్రయాణీకులు ఇప్పటి వరకూ తమ ఫాస్ట్ట్యాగ్లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవటం సాధ్యమయ్యేది కాదు. ఫలితంగా చాలాసార్లు ఫాస్ట్ట్యాగ్ ఉన్న టోల్ ప్లాజాల వద్ద జాప్యం జరగటం లేదా నగదు చెల్లించడం చేయాల్సి వచ్చేది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఫాస్ట్ట్యాగ్ యాప్లో ఓ కొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది.

ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులు తమ ట్యాగ్లో ఉన్న బ్యాలెన్స్ స్థితిని తెలుసుకోవడానికి ఈ కొత్త ఫీచర్ సహాయపడుతుంది. ఇందుకు యూజర్లు చేయాల్సిందల్లా తమ స్మార్ట్ ఫోన్లలో ఫాస్ట్ట్యాగ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవటమే. ఇది ఆండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్ యూజర్ల కోసం ఆయా ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది.

ఫాస్ట్ట్యాగ్ యూజర్లు యాప్ స్టోర్ నుండి 'My FASTag App' యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారి ట్యాగ్ వివరాలను అందులో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత యాప్లో 'Check Balance Status' అనే దానిని ట్యాప్ చేయటం ద్వారా వారి ఫాస్ట్ట్యాగ్లో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చని ఎన్హెచ్ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.

రియల్ టైమ్ ప్రాతిపదికన ట్యాగ్ బ్యాలెన్స్ స్థితిని తనిఖీ చేయడానికి మరియు ట్యాగ్ బ్యాలెన్స్ విషయంలో ఎదురయ్యే సమస్యలను తొలగించడంలో ఇటు హైవే యూజర్కు మరియు టోల్ ఆపరేటర్లు ఇద్దరికీ ఉపయోగపడేలా ఈ కొత్త ఫీచర్ను అప్డేట్ చేశారు. దీని సాయంతో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణాలు సజావుగా సాగుతాయని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.

మరోవైపు ETC (ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) వ్యవస్థలో కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఈ యాప్ను అప్డేట్ చేశారు. ఇందులో ప్రస్తుత స్థితిని చూపించడానికి మరియు బ్లాక్లిస్ట్ చేసిన ట్యాగ్ల రిఫ్రెష్ సమయాన్ని 10 నిమిషాల నుండి 3 నిమిషాలకు తగ్గించేలా అప్డేట్స్ చేశారు.

మై ఫాస్ట్ట్యాగ్ యాప్ కలర్ కోడ్స్ రూపంలో ఫాస్ట్ట్యాగ్ వాలెట్ బ్యాలెన్స్ స్థితిని చూపిస్తుంది. ఇందులో తగినంత బ్యాలెన్స్ ఉన్న యాక్టివ్ ట్యాగ్ కోసం ఆకుపచ్చ రంగు (గ్రీన్ కలర్), తక్కువ బ్యాలెన్స్ ఉన్న ట్యాగ్లకు నారింజ / అంబర్ (ఆరెంజ్ కలర్) మరియు బ్లాక్లిస్ట్ చేయబడిన ట్యాగ్లకు ఎరుపు (రెడ్ కలర్) ఉంటుంది.

అంటే వాలెట్ రెడ్ కలర్ ఉంటే, ఆ ట్యాగ్ టోల్ ప్లాజాల వద్ద పనిచేయదని యూజర్లు గుర్తుంచుకోవాలి. యూజర్లు తమ వాలెట్ కలర్ ఆరెంజ్లోకి మారిన తక్షణమే తిరిగి వాలెట్ను రీచార్జ్ చేసుకున్నట్లయితే, టోల్ ప్లాజాల వద్ద సమయం వృధా కాకుండా ప్రయాణించవచ్చు.

కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతా నుండి కానీ లేదా టోల్ ప్లాజా పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) నుండి కానీ తమ ట్యాగ్ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ట్యాగ్ కోసం ఎన్హెచ్ఏఐ దేశంలోని 26 బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది మరియు దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద 40,000 కి పైగా పిఓఎస్లను ఏర్పాటు చేసింది.

ఫాస్ట్ట్యాగ్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?
ఫాస్ట్ట్యాగ్ అనేది వాహనాల విండ్షీల్డ్పై అమర్చిన ఓ డిజిటల్ స్టిక్కర్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ స్టిక్కర్ కలిగిన వాహనం టోల్ ప్లాజా గుండా వెళుతున్నప్పుడు, అక్కడ ఉండే సెన్సార్లు ఈ ట్యాగ్ని రీడ్ చేసి, ఫాస్ట్ట్యాగ్తో అనుసంధానించబడిన బ్యాంక్ లేదా ప్రీపెయిడ్ ఖాతా నుండి డబ్బును ఆటోమేటిక్గా డిడక్ట్ చేస్తాయి.


Click it and Unblock the Notifications








