మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసిలో కొత్త అప్డేట్; వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ మార్కెట్లో ఇటీవలే విడుదల చేసిన తమ సరికొత్త మరియు మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈక్యూసిలో ఓ కొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇప్పుడు మరింత శక్తివంతమైన ఆన్బోర్డ్ ఛార్జర్తో అందుబాటులోకి వచ్చింది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీలో కొత్తగా అప్డేట్ చేసిన ఆన్బోర్డ్ చార్జర్ మునుపటి కన్నా మరింత శక్తివంతమైనది మరియు అవసరమైన ఛార్జ్ సమయాన్ని కూడా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని పవర్ఫుల్ 11 కిలోవాట్ ఆన్బోర్డ్ ఛార్జర్ ఇప్పుడు కేవలం 7 గంటల 30 నిమిషాల్లోనే ఈక్యూసి యొక్క 80 కిలోవాట్ అవర్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుంది. ఈ కారులో ఇదివరకు ఉన్న 7.4 కిలోవాట్ ఛార్జర్ ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 11 గంటల సమయం పట్టేది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఎస్యూవీలో 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ప్రతి యాక్సిల్ వద్ద అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 405 బిహెచ్పి పవర్ని మరియు 765 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తాయి. పూర్తి ఛార్జ్పై ఈ కారు గరిష్టంగా 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ను ఆఫర్ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 40 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బ్యాటరీని 0 - 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్స్తో లభిస్తుంది. ఇందులో గ్రిల్పై ప్రకాశించే మెర్సిడెస్ బెంజ్ బ్యాడ్జింగ్ మరియు ఇరువైపులా ఎల్ఈడి హెడ్ల్యాంప్లను అనుసంధానించే ఎల్ఈడి స్ట్రిప్ ఉంటాయి. వెనుక వైపున, స్టైలిష్ టెయిల్ ల్యాంప్స్, బూట్ లిడ్పై అంతటా ఉన్న లైట్ బార్ ఉంటుంది. ఇందులో స్పెషల్ డ్యూయెల్-టోన్ సిక్స్-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్, రూఫ్ స్పాయిలర్ మరియు క్రోమ్-ఫినిష్డ్ విండో-లైన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇంటీరియర్స్లో రెండు 10.3 ఇంచ్ డిస్ప్లేలు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం మరియు మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వాయిస్-యాక్టివేటెడ్ ఫంక్షన్లతో పాటుగా బ్రాండ్ యొక్క సరికొత్త ఎమ్బియూఎక్స్ సిస్టమ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులోని కొన్ని వేరియంట్లు రోస్ గోల్డ్ యాక్సెంట్స్తో లభిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ తమ మొదటి ఎలక్ట్రిక్-ఎస్యూవీని గత నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ఎక్స్-షోరూమ్ (ఇండియా) ప్రారంభ ధర రూ.99.30 లక్షలుగా ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మా డ్రైవ్స్పార్క్ బృందం ఇటీవలే ఫస్ట్ డ్రైవ్ చేసింది. - ఈ కారుకు సంబంధించిన పూర్తి సమీక్ష కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఫాస్ట్ చార్జర్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇప్పుడు మరింత శక్తివంతమైన ఆన్బోర్డ్ చార్జర్తో లభ్యం కానుంది. దీని సాయంతో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారును మరింత తక్కువ సమయంలోనే చార్జ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications