సుజుకి జిమ్నీని భారత్లో విడుదల చేయటమే కాదు, తయారీ కూడా ఇక్కడే..!
భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియాకి చెందిన జపాన్ విభాగం సుజుకి మోటార్ కార్పోరేషన్ దేశీయ మార్కెట్కు తమ సరికొత్త జీప్ స్టయిల్ ఎస్యూవీ "జిమ్నీ"ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

అయితే, తాజాగా ఈటిఆటోలో ప్రచురించిన కథనం ప్రకారం, సుజుకి జిమ్నీ ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేయటమే కాకుండా, ఈ మోడల్ ఉత్పత్తిని పూర్తిగా భారతదేశానికి తరలించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్ను సుజుకి జిమ్నీ ప్రొడక్షన్ హబ్గా మార్చాలని సుజుకి భావిస్తోందట, ఇందుకు సంబంధించిన పనులను కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.

సుజుకి ప్రస్తుతం జపాన్లో జిమ్నీ వాహనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ దేశంలో కంపెనీ ఏటా సుమారు 50,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. ప్రారంభంలో సుజుకి తమ జిమ్నీ విడిభాగాలను భారత్కు దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబుల్ చేయాలని భావించింది. అయితే, ఇప్పుడు ఏకంగా మొత్తం జిమ్నీ ఉత్పత్తినే భారత్కు తరలించాలని కంపెనీ భావిస్తోంది.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పో 2020లో మారుతి సుజుకి త్రీ-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీని ప్రదర్శనకు ఉంచింది. ఆ సమయంలో ఈ మోడల్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే, ఇండియాలో మాత్రం త్రీ-డోర్తో పాటుగా ఫైవ్-డోర్ వెర్షన్ కూడా మార్కెట్లో విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

భారత్లో తయారయ్యే సుజుకి జిమ్నీ ఎస్యూవీని ఇక్కడి నుండి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. గతేడాది మారుతి సుజుకి ఇండియా డిస్కంటిన్యూ చేసిన జిప్సీ స్థానంలో కొత్త సుజుకి జిమ్నీ మోడల్ను ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్ కోసం తయారు చేయబోయే సుజుకి జిమ్నీలో అంతర్జాతీయ మోడల్తో పోలిస్తే కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

విదేశాల్లో లభిస్తున్న ఫైవ్-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ కారులో 1.5 లీటర్ కె15 పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్పి శక్తిని, 130 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్కు వచ్చే సరికి మారుతి సుజుకి తమ సియాజ్, ఎర్టిహా, విటారా బ్రెజ్జా మోడళ్లలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్నే ఇందులోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ కూడా ఇంచు మించు పైన పేర్కొన్న గణాంకాలనే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతున్న సుజుకి జిమ్నీ మోడళ్లలో సుజుకి యొక్క స్మార్ట్ప్లే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటర్నేషనల్ మోడళ్లలో లభించే ఆల్-గ్రిప్ 4 డబ్ల్యుడి సిస్టమ్ (ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్) భారతదేశంలో విక్రయించే జిమ్మీలో లభిస్తుందో లేదో వేచి చూడాలి. సుజుకి జిమ్నీ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఈ ఎస్యూవీని దేశవ్యాప్తంగా మారుతి సుజుకి నెక్సా ప్రీమియం అవుట్లెట్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

సుజుకి జిమ్నీ ఎస్యూవీ ఉత్పత్తిని భారత్కు తరలించడంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని, ఈ విభాగంలోని అవకాశాలను దక్కించుకునేందుకు సుజుకి తమ జిమ్నీ ఎస్యూవీని భారత్లో విడుదల చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా, ఈ మోడల్ను పూర్తిగా భారత్లోనే ఉత్పత్తి చేయటం ద్వారా దీని ధరను కూడా అందుబాటులో ఉంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
Source:Economic Times


Click it and Unblock the Notifications