భారత్లో కొత్త భాగస్వామి కోసం వెతుకుతున్న టాటా మోటార్స్
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు చెందిన టాటా మోటార్స్ ఇప్పుడు తమ ప్యాసింజర్ వెహికల్ (పివి) వ్యాపారానికి సంబంధించి ఓ కొత్త భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. రానున్న దశాబ్దంలో టాటా మోటార్స్, భారతదేశంలో దాని వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేయడంలో మరొక వాహన తయారీదారుతో కలిసి పనిచేయాలని కంపెనీ యోచిస్తోంది.

ప్యాసింజర్ వాహన వ్యాపారంలో భాగస్వామ్యంతో పాటుగా, టాటా మోటార్స్ కూడా కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా భారీ మొత్తంలో పెట్టుబడులు వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ప్రణాళికలతో కంపెనీ అభివృద్ధి చేయబోయే నూతన ఉత్పత్తుల జీవిత చక్రాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.

ఈ విషయంపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ (పివిబియు) ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పిటిఐకి ఓ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ అనుబంధ సంస్థగా ఒక భాగస్వామిని నియమించుకోవటం ద్వారా వచ్చే దశాబ్దంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు మరియు నిబంధనలలో గణనీయమైన పెట్టుబడులను చూసే అవకాశం ఉంటుందని అన్నారు.

అంతేకాకుండా, ఇలా చేయటం వలన ఉత్పత్తి జీవిత చక్రాలను తగ్గించడంతో పాటుగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేయటానికి ఈ సహకారం సహాయపడుతుందని శైలేష్ చంద్ర చెప్పారు. వీటన్నింటికీ భారీ మొత్తం పెట్టుబడులు అవసరమవుతాయి మరియు ఇందుకు వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని తాము చురుకుగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

టాటా మోటార్స్ బోర్డు సభ్యులు ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ప్రయాణీకుల వాహన వ్యాపార యూనిట్ (పివిబియూ) కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ప్రణాళికల ప్రకారం, కొత్త సంస్థ అన్ని కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఐపి, ఉద్యోగులు మరియు ఇతర సంబంధిత ఆస్తులను ఒకే గొడుగు కిందకు తెస్తుంది.

ఇందుకు సంబంధించి నిర్దిష్ట కాలక్రమాలు ఏవీ లేవని, సబ్సియరైజేషన్ ప్రక్రియకు సంబంధించినంత వరకు వ్యాపారాన్ని ప్రత్యేక చట్టపరమైన సంస్థగా మార్చే ప్రక్రియను ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నామని చంద్ర తెలిపారు. తమ కొత్త భాగస్వామికి అన్వేషణకు సంబంధించినంత వరకు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు.

టాటా మోటార్స్ తమ ప్రయాణీకుల వాహన విభాగంలో భాగస్వాముల కోసం వెతకడం కొత్త విషయమేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇదే కోవలో కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు ఎక్కువ ఫలితాలను సాధించడానికి రెండు మూడు సంస్థలుగా కలిసి పనిచేస్తున్నాయి.

టాటా మోటార్స్ కొత్త భాగస్వామి అన్వేషణపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
వ్యాపారంలో షేర్డ్ మొబిలిటీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా ప్రాచుర్యం పొందిన ప్రక్రియ. ఇప్పుడిప్పుడే ఇది భారత్లోకి కూడా ప్రవేశిస్తోంది. తాజా ఉదాహరణగా మారుతి సుజుకి, టొయోటా కంపెనీలను తీసుకువోచ్చు. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే బాలెనో-గ్లాంజా, విటారా బ్రెజ్జా-అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్లను షేర్డ్ మొబిలిటీపై తయారు చేసిన సంగతి తెలిసినదే. ఇదే బాటలో టాటా మోటార్స్ కూడా కొత్త ఉత్పత్తులను, కొత్త సాంకేతికతలను మనకు పరిచయం చేయటం కోసం మరొక బలమైన భాగస్వామి కోసం చూస్తోంది.


Click it and Unblock the Notifications








