ఆ విడి భాగాలను ఇక్కడే తయారు చేయాలి, దిగుమతులు నిషేధించాలి: మంత్రి
రానున్న రోజుల్లో దేశంలో శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ వంటి సహజంగా లభించే ఇంధనాలు) లభ్యత భారీగా క్షీణించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, దాదాపు అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వీటికి ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి.

ఒకప్పుడు అదికొద్ది సంఖ్యలో మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉండేవి. కాగా.. ఇప్పుడు దాదాపు ప్రతీ ఆటోమేకర్ నుంచి ఓ ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే, పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల ధర చాలా అధికంగా ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం, వీటిలో ఉపయోగించే అనేక రకాల విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటమే.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాలు ఎక్కువగా ఉండటంతో అవి కాస్తా భారత్కు చేసే సరికి వాటి అసలు ధర కన్నా రెట్టింపు ధరను చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా సదరు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆటో మేకర్లు ఎలక్ట్రిక్ వాహనాలలో ముఖ్యంగా ఉపయోగించే మోటార్, బ్యాటరీ వంటి కీలక విడి భాగాలను ఇతర కాంపోనెంట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాన్నారు.

ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోవిడ్-19 పరిస్థితుల తర్వాత భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్మ్యాప్ గురించి ఓ వెబినార్లో మాట్లాడుతూ.. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కంపెనీలు, వీటి విడిభాగాల కోసం చైనా దేశంపై ఆధారపడకుండా, ఇక్కడే స్థానికంగా వాటిని తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వీటిని దేశీయ ఎలా ఉత్పత్తి చేయాలనే అంశంపై కంపెనీలు దృష్టి సారించాలని కోరారు.

ప్రస్తుతం చైనా నుంచి లభిస్తున్న వస్తువుల ధరలు చాలా ఆకర్షనీయంగా ఉన్నాయని, ఇలా విడి భాగాలను దిగుమతి చేసుకోవటం ద్వారా భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు మంచి లాభాలను గడిస్తున్నారని గడ్కరీ చెప్పారు.

కాగా.. భవిష్యత్తులో భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లయితే, వాటిలో ఉపయోగించే విడిభాగాల కోసం సదరు చైనా కంపెనీలు ప్రస్తుతం ఉన్న రేట్ల కన్నా మరింత అధిక మొత్తంలో వసూలు చేసే అవకాశం ఉంటుందని, కాబట్టి పొరుగు దేశాలపై ఆధారపడకుండా స్వయం శక్తితో ముందుకు సాగితేనే పరిశ్రమలు విజయం సాధిస్తాయని అన్నారు.

ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. మైసూర్లోని విద్యావర్థక కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (వివిసీఈ) విద్యార్థుల బృందం విద్యుత్శక్తితో నడిచే టాటా నానో కారును తయారు చేసింది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధర (రూ.1,55,000) కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా ఈ ఎలక్ట్రిక్ టాటా నానో కారును తయారు చేశారు.

వివిసీఈ విద్యార్థులు తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ కారులో ఒక వ్యక్తి సగటున సింగిల్ చార్జ్పై 40 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఇందుకు ప్రతి కిలోమీటరుకు అయ్యే ఖర్చు కేవలం రూ.1.15 మాత్రమే. అదే కారులు నలుగురు కూర్చుని ప్రయాణిస్తే ఈ రేంజ్ 35 కిలోమీటర్లుగా ఉంటుంది. అందుకు ప్రతి కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ.1.32 గా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కారులో ఒక వ్యక్తి మాత్రమే ఉంటే ఇది గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది, అదే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే దీని టాప్ స్పీడ్ 35-40 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఈ కారులోని బ్యాటరీ జీరో నుంచి పూర్తిగా చార్జ్ కావటానికి 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది, ఇందులో క్విక్ చార్జ్ ఆప్షన్ లేదు.

ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల నిషేధంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుతం చైనా-భారత్ సైన్యాల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా భారతదేశంలో ఇప్పటికే చైనా వస్తువులను, దిగుమతులను నిషేధించాలని పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని సమర్ధిస్తున్నట్లుగానే అనిపిస్తోంది. నిజానికి ఇలాంటి విడిభాగాలను మన దేశంలోనే తయారు చేయటం వలన స్థానికంగా ఉద్యోగాలు లభించటమే కాకుండా మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో స్వదేశీ వాహనాలను నడుపుతున్న అనుభూతి కలుగుతుందనేది మా అభిప్రాయం.


Click it and Unblock the Notifications








