సెకండ్ హ్యాండ్ కార్ల కోసం వోక్స్వ్యాగన్ కొత్త స్కీమ్
జర్మన్ కార్ బ్రాండ్ వోక్స్వ్యాగన్ భారత వినియోగదారుల కోసం మరో కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. తొలిసారిగా కారు కొనుగోలు చేసేవారు లేదా కొత్త కారుని కొనుక్కునే స్థోమత లేని వారు లేదా సెకండ్ హ్యాండ్ కార్లపై ఆసక్తి ఉన్నవారి కోసం వోక్స్వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0 (Das WeltAuto 3.0) అనే కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టింది.

భారత్లో యూజ్డ్ కార్ (వాడిన కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లు, ప్రీ-ఓన్డ్ కార్ల) వ్యాపారంలోకి ప్రవేశించి ఆ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వోక్స్వ్యాగన్ ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. డస్ వెల్ట్ఆటో 3.0లో భాగంగా కస్టమర్లు తమకు కావల్సిన కార్లను కొనుగోలు చేయటం లేదా తమ పాత కార్లను విక్రయించడంలో వోక్స్వ్యాగన్ సహకరిస్తుంది.

వోక్స్వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0 కోసం కంపెనీ కొత్త రకం షోరూమ్లను ప్రారంభించింది. ఈ సందర్భంగా వోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ న్యాప్ మాట్లాడుతూ.. కోవిడ్-19 ప్రభావంతో వినియోగదారులంతా సురక్షితమైన ప్రయాణం కోసం చూస్తున్నారని, అందులో భాగంగానే కస్టమర్లు ఎక్కువగా యూజ్డ్ కార్లను ఎంచుకుంటున్నారని, ఈ సెగ్మెంట్లోని కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు మరియు సరసమైన ధరకే వారికి మంచి కార్లను అందించేందుకు ఈ వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు.

యూజ్డ్ కార్ బిజినెస్లో ఓ క్రమ పద్ధతిలో వ్యాపారం సాగేలా వోక్స్వ్యాగన్ ముందుకు సాగుతుందని, కస్టమర్లు వెచ్చించే డబ్బుకు తగిన విలువతో కార్లను అందిస్తామని స్టీఫెన్ చెప్పారు. కోవిడ్-19 తర్వాత మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని తాము కొత్తగా ప్రారంభించిన డస్ వెల్ట్ఆటో 3.0తో అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కస్టమర్లు తమ ఇంటి నుంచే డస్ వెల్ట్ఆటో 3.0 వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్న ప్రీఓన్డ్ కార్లను బ్రౌజ్ చేసి, నచ్చితే కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఎవరైనా కస్టమర్లు తమ పాత కార్లను విక్రయించాలనుకుంటే ఏ బ్రాండ్ కార్లనైనా సరే అది మార్కెట్లో ఎంత ధర పలుకుతుందో అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు, ధర నచ్చితే విక్రయించవచ్చు.

ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉండే డస్ వెల్ట్ఆటో వ్యాల్యుయేటర్ సాయంతో తమ పాత వాహనాల విక్రయానికి సంబంధించిన కొటేషన్ను పొందవచ్చు. ఇందుకోసం విశిష్టమైన మొబైల్ అప్లికేషన్ను కూడా వోక్స్వ్యాగన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ బ్లూ బుక్లో ఇచ్చిన వర్గీకరణ ఆధారంగా పాత కార్లను విలువ కడతారు. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

ఇదిలా ఉంచితే.. వోక్స్వ్యాగన్ ఇటీవలే తమ బెస్ట్ సెల్లింగ్ కార్లయినా పోలో, వెంటో మోడళ్లలో టిఎస్ఐ ఎడిషన్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో పోలో టిఎస్ఐ ధర రూ.7.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, వెంటో టిఎస్ఐ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ రెండు కూడా స్పెషల్ ఎడిషన్ మోడళ్లు.

ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో రెగ్యులర్ వేరియంట్ల కన్నా అధికంగా యాడ్-ఆన్ ఫీచర్లు లభ్యం కానున్నాయి. మెకానికల్గా ఈ రెండెంటిలో ఎలాంటి మార్పులు లేవు. ఈ రెండు కార్లలో కూడా 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్పిల శక్తిని, 175 ఎన్ఎమ్ల టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో లభిస్తాయి. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం పోలో లీటరుకు 18.24 కిలోమీటర్ల మైలేజీని, వెంటో లీటరుకు 17.69 కిలోమీటర్ల మైలేజీనిస్తాయి.

వోక్స్వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం
వోక్స్వ్యాగన్కు భారత మార్కెట్లో మంచి బ్రాండ్ నేమ్ ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ స్టార్ట్ చేసింది. కొత్తకార్ల మాదిరిగానే ప్రీఓన్డ్ కార్లను కూడా నిపుణులు అనేక రకాలుగా పరీక్షించి, సర్టిఫై చేసిన తర్వాతనే విక్రయిస్తారు. కాబట్టి, బయటి మార్కెట్లో యూజ్డ్ కార్లను కొనుగోలు చేయటానికి వోక్స్వ్యాగన్ నుంచి కొనుగోలు చేయటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కార్లను విక్రయించే వారికి వోక్స్వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0 మంచి రేట్లను ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








