ఫోక్స్వ్యాగన్ పోలో, వెంటో మోడళ్లలో స్పెషల్ ఎడిషన్స్ విడుదల: ధర, వివరాలు
ఫోక్స్వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడళ్లు పోలో హ్యాచ్బ్యాక్ మరియు వెంటో సెడాన్లలో కంపెనీ కొత్తగా రెడ్ అండ్ వైట్ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. మార్కెట్లో ఫోక్స్వ్యాగన్ పోలో మరియు వెంటో రెడ్ అండ్ వైట్ స్పెషల్ ఎడిషన్ మోడళ్ల ధరలు వరుసగా రూ.9.19 లక్షలు మరియు రూ.11.49 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ, ఇండియా).

భారతదేశంలో తమ వార్షిక ‘ఫోక్స్ ఫెస్ట్ 2020' పండుగ ప్రచారాన్ని ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగానే, భారతదేశంలో పండుగ సీజన్ను స్వాగతించేందుకు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడళ్లను పరిచయం చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఫోక్స్వ్యాగన్ కొత్తగా విడుదల చేసిన రెడ్ అండ్ వైట్ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు, వీటి కోసం ఎలాంటి అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ వేరియంట్ల ధరకే ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే, దేశంలో పరిమిత సమయం వరకు మాత్రమే ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను అందిస్తున్నామని, స్టాండర్డ్ మోడల్తో పోలిస్తే వీటిలో కాస్మెటిక్ మార్పులు ఉంటాయని కంపెనీ తెలిపింది.

రెడ్ అండ్ వైట్ స్పెషల్ ఎడిషన్ పోలో మరియు వెంటో మోడళ్లను స్టాండర్డ్ హైలైన్ ప్లస్ ఏటి వేరియంట్లను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో అనేక కాస్మెటిక్ మార్పులు ఉంటాయి. రెడ్ అండ్ వైట్ ఎడిషన్ పోలో మరియు వెంటో మోడళ్లు ఫ్లాష్ రెడ్, సన్సెట్ రెడ్ మరియు కాండీ వైట్ రంగులలో లభిస్తాయి.

ఫోక్స్వ్యాగన్ పోలో హ్యాచ్బ్యాక్పై రెడ్ పెయింట్ స్కీమ్ ఉంటుంది, వీటిలో అనేక ట్రిమ్ భాగాలు ఉంటాయి. మరోవైపు, వెంటో మోడల్ వైట్ పెయింట్ స్కీమ్ను కలిగి ఉంటుంది, వీటిలో కూడా అనేక ట్రిమ్ భాగాలు ఉంటాయి.

ఈ స్పెషల్ ఎడిషన్ కార్లలోని ఇతర ఫీచర్లలో స్టైలిష్ బాడీ సైడ్ స్ట్రైప్స్, కలర్-కోఆర్డినేటెడ్ సైడ్ మిర్రర్ కవర్స్, సైడ్ మిర్రర్స్కు ఇరువైపులా ఉండే‘రెడ్ అండ్ వైట్' బ్యాడ్జింగ్ మరియు రూఫ్-స్పాయిలర్ ఉంటాయి. ఇవన్నీ కూడా సంబంధిత మోడల్కు చెందిన రూఫ్ కలర్ పెయింట్ స్కీమ్లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

ఈ రెండు స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో చేసిన మార్పులు కేవలం కాస్మెటిక్కి మాత్రమే పరిమితం కానున్నాయి. వీటి ఇంజన్లలో ఎలాంటి మార్పులు లేవు. పోలో మరియు వెంటో ఏటి మోడళ్లలో ఉపయోగించిన 1.0-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్పి పవర్ను మరియు 170 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోక్స్వ్యాగన్ పోలో ఏటి మరియు వెంటో ఏటి మోడళ్లు వరుసగా లీటరుకు 16.47 కిలోమీటర్లు మరియు 16.35 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

ఫోక్స్ ఫెస్ట్ 2020 ప్రచారంలో భాగంగా, కంపెనీ ఈ కొత్త మోడళ్లను విడుదల చేయటంతో పాటుగా ఇప్పటికే ఉన్న మరియు సంభావ్య కస్టమర్ల కోసం కూడా వివిధ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ మరియు లాయల్టీ ప్రయోజనాలు, సర్వీస్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, ఫైనాన్స్ ఆప్షన్లు మరియు ప్రతి టెస్ట్ డ్రైవ్లో ఖచ్చితమైన బహుమతులు మొదలైనవి ఉన్నాయి. ఈ ఆఫర్లను ప్రస్తుత పండుగ సీజన్లో ఏదైనా అధీకృత డీలర్షిప్ నుండి కానీ లేదా బ్రాండ్ యొక్క ఆన్లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్ఫామ్ నుండి కానీ పొందవచ్చు.

ఈ విషయంపై ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మిస్టర్ స్టీఫెన్ నాప్ మాట్లాడుతూ, "మా వార్షిక పండుగ ప్రచారం 'ఫోక్స్ ఫెస్ట్ 2020'లో భాగంగా పోలో మరియు వెంటోలలో మా స్పెషల్ రెడ్ అండ్ వైట్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయత్నం మా కస్టమర్లకు ప్రత్యేకమైన మరియు మెరుగైన ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను అందించడం ద్వారా వారితో నిమగ్నమవ్వాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని" అన్నారు.

ఫోక్స్వ్యాగన్ పోలో, వెంటో స్పెషల్ ఎడిషన్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఫోక్స్వ్యాగన్ ఈ పండుగ సీజన్ కోసం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్బ్యాక్ మరియు సెడాన్ మోడళ్లలో ప్రత్యేక ఎడిషన్లను ప్రవేశపెట్టడం ద్వారా వీటిని కొనుగోలుదారులకు మరింత చేరువ చేయాలని చూస్తోంది. ఈ ప్రత్యేకమైన మార్పులతో వచ్చిన పోలో, వెంటో కార్లు స్టాండర్డ్ వేరియంట్ల కన్నా భిన్నంగా, స్టైలిష్గా కనిపిస్తాయి.


Click it and Unblock the Notifications








