చెన్నైలో భారీ వర్షాలు: 2021 ఇండియన్ నేషన్ ర్యాలీ ఛాంపియన్షిప్ వాయిదా
చెన్నైలో జరగాల్సిన 2021 ఇండియన్ నేషన్ ర్యాలీ ఛాంపియన్షిప్ రద్దు చేయబడింది. భారీ వర్షాల కారణంగా 2021 ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ (ఐఎన్ఆర్సి) చెన్నై రౌండ్ను తదుపరి తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సిఐ) ప్రకటించింది.

వాస్తవ షెడ్యూల్ ప్రకారం, ఈ ర్యాలీ జూలై 31 మరియు ఆగస్టు 1, 2021 తేదీలలో జరగాల్సి ఉంది. చెన్నైలో జరగనున్న ఈ రేస్ 2021 ఇండియన్ నేషన్ ర్యాలీ ఛాంపియన్షిప్ యొక్క ప్రారంభ రౌండ్ను సూచిస్తుంది. ఈ ఛాంపియన్షిప్కు సంబంధించిన తాజా తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు.

వాస్తవానికి ఈ ఛాంపియన్షిప్ గడచిన ఏప్రిల్లోనే జరగాల్సి ఉంది. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ రావడంతో మొదటిసారి ఈ ర్యాలీ వాయిదా పడింది. కాగా, ఇప్పుడు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండవసారి కూడా ఈ ఛాంపియన్షిప్ వాయిదా పడింది.

ఎఫ్ఎంఎస్సిఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, "నేషనల్ ర్యాలీ క్యాలెండర్లో ఉత్తమంగా నిర్వహించబడిన ఈవెంట్లలో ఒకటిగా ఉన్న దక్షిణ భారత ర్యాలీలో పాల్గొనడానికి మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు; ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మా క్లబ్ నిరంతరం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు, వరుణ దేవతలు మాపై కరుణ చూపలేదు, గత కొన్ని రోజులుగా చెన్నైలో భారీగా వర్షం పడుతోంది, మరికొన్ని రోజుల పాటు రికార్డు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది."

"ఈ నేపథ్యంలో, 2021 ఇండియన్ నేషన్ ర్యాలీ ఛాంపియన్షిప్ పాల్గొనేవారి భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఈ నెలాఖరున జరగాల్సిన ర్యాలీని వాయిదా వేయడమైనది. తదుపరి తేదీలను నిర్ణయించడానికి మేము ఫెడరేషన్ మరియు ప్రమోటర్లతో చర్చిస్తున్నాం. వచ్చే వారం పరిస్థితులను అంచనా వేసిన తరువాత కొత్త తేదీలను ప్రకటించడం జరుగుతుంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ర్యాలీ నిర్వాహకులు మరియు ఎఫ్ఎంఎస్సిఐ చెన్నైలోని తాజా పరిస్థితులను అంచనా వేసి తదనుగుణంగా ర్యాలీకి కొత్త తేదీలను ప్రకటిస్తారు. ఐఎన్ఆర్సిని ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ప్రమోట్ చేస్తుంది. ఈ ర్యాలీ చెన్నై శివార్లలోని శ్రీపెరంబుదూర్లో ఉన్న మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ (ఎంఎంఆర్టి) వద్ద ప్రారంభమై గ్రామీణ ప్రాంతాల వైపు వెళ్తుంది.

2021 ఇండియన్ నేషన్ ర్యాలీ ఛాంపియన్షిప్ క్యాలెండర్ గడచిన ఏప్రిల్లోనే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ పలు కారణాల వలన ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఈ ర్యాలీ బెంగళూరు, కోయంబత్తూర్, ఢిల్లీ-ఎన్సిఆర్, హంపి మరియు నాగాలాండ్లతో కలిపి మొత్తం ఆరు రౌండ్లు ఉంటాయి. వీటిలో మొదటి రౌండ్ చెన్నై నుండే ప్రారంభం కావల్సి ఉంది.


Click it and Unblock the Notifications