కరోనా గుబుల్.. ఏప్రిల్లో అన్ని వాహన విభాగాల రిజిస్ట్రేషన్లు ఢమాల్..!
కరోనా భయంతో గడచిన ఏప్రిల్ 2021 నెలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత నెలలో అన్ని విభాగాలకు చెందిన వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా క్షీణించాయి.

ఏప్రిల్ 2021 నెలలో రిజిస్టర్ అయిన ద్విచక్ర వాహనాలు , త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు మరియు ప్రైవేటు, వాణిజ్య వాహనాల డేటాను ఫడా విడుదల చేసింది. గత నెలలో ద్విచక్ర వాహనాలు 27.63 శాతం, మూడు చక్రాల వాహనాలు 43.11 శాతం, ప్రయాణీకుల వాహనాలు 25.33 శాతం, ట్రాక్టర్లు 44.58 శాతం మరియు వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు 23.65 శాతం క్షీణతను నమోదు చేశాయి.

గత నెలలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో దేశంలోని అనేక రాష్ట్రాలు పాక్షిక మరియు సంపూర్ణ లాక్డౌన్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో వాహనాల అమ్మకాలు కూడా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా భారీగా క్షీణించాయి. గత ఏడాది ఏప్రిల్ (2020)లో కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా విధించిన లాక్డౌన్తో సున్నా వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదైన సంగతి తెలిసినదే.

ద్విచక్ర వాహనాల విభాగంలో, గడచిన ఏప్రిల్ నెలలో 8,65,134 యూనిట్ల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అంతకు ముందు నెలతో (మార్చి 2021లో) ఇవి 11,95,445 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 27.63 శాతం క్షీణించాయి.

త్రిచక్ర వాహన (త్రీ వీలర్) విభాగంలో గత ఏప్రిల్ 2021 నెలలో మొత్తం 21,636 యూనిట్లు రిజిస్టర్ కాగా, మార్చి 2021లో ఇవి 38,034 యూనిట్లుగా ఉన్నాయి. టూవీలర్స్ రిజిస్ట్రేషన్ల మాదిరిగానే త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు కూడా ఈ సమయంలో 43.11 శాతం క్షీణితను నమోదు చేశాయి.

గడచిన ఏప్రిల్ 2021 నెలలో దేశంలో మొత్తం 2,08,883 యూనిట్ల ప్యాసింజర్ కార్లు రిజిస్టర్ కాగా, అంతకు ముందు నెలలో (మార్చి 2021లో) ఇవి 2,79,745 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో దేశీయ ప్యాసింజర్ కార్లు 25.33 శాతం తగ్గాయి.

ఇప్పటి వరకూ వృద్ధిలో కొనసాగిన దేశీయ ట్రాక్టర్ల అమ్మకాలు కూడా గడచిన నెలలో భారీగా తగ్గాయి. గడచిన ఏప్రిల్ 2021లో వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాల కోసం ఉపయోగించే ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు 38,285 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, ఇవి మార్చి 2021లో 69,082 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో ట్రాక్టర్ల అమ్మకాలు 44.58 శాతం క్షీణించాయి.

ఇక వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే, గత నెలలో ఇవి కూడా భారీగా క్షీణించాయి. గత నెలలో 51,436 మొత్తం వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, అంతకు ముందు నెలలో ఇవి 67,372 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు 23.65 శాతం తగ్గాయి.

కోవిడ్-19 సెకండ్ వేవ్ కేవలం పట్టణాలను మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోందిని ఫడా వ్యాఖ్యానించింది. తెలంగాణ మినహా భారతదేశంలోని సుమారు 95 శాతం ప్రాంతాలు లాక్డౌన్ను పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మే నెల మొదటి రెండు వారాల్లో కూడా అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








