మనోళ్లు ఈ ఎలక్ట్రిక్ కారును ఎగబడి మరీ కొంటున్నారు.. అప్పుడై అమ్ముడైపోయాయట!
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి బ్రాండ్, గడచిన జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఆడి ఇ-ట్రోన్' అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయింది. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన 20 రోజుల్లోనే మొదటి బ్యాచ్ మొత్తం అమ్ముడైనట్లు ఆడి ఇండియా ప్రకటించింది.

ఆడి ఇ-ట్రోన్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ మరియు ఇ-ట్రోన్ స్పోర్ట్బ్యాక్ మోడళ్లను కంపెనీ గత నెల 22వ తేదీన దేశీయ విపణిలో విడుదల చేసింది. భారతీయ కస్టమర్ల నుండి ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకు మెరుగైన స్పందన లభిస్తోందని ఆడి ఇండియా అధ్యక్షుడు బల్బీర్ ధిల్లాన్ అన్నారు.

కాగా, మొదటి బ్యాచ్లో విక్రయించిన యూనిట్ల సంఖ్యను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఆడి ఇండియా ఈ ఎలక్ట్రిక్ కారును ఇ-ట్రోన్ 50, ఇ-ట్రోన్ 55 మరియు ఇ-ట్రోన్ స్పోర్ట్బ్యాక్ అనే మూడు వేరియంట్లలో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.99.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాల్లో తయారు చేసి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. ఫలితంగా, ఈ కారు ధర కూడా సాధారణం కన్నా రెట్టింపుగా ఉంటుంది. కాగా, రెండవ బ్యాచ్ను ఎప్పుడు దిగుమతి చేసుకునే విషయాన్ని కంపెనీ ఇంకా తెలియజేయలేదు.

ఆడి ఇ-ట్రోన్ 50 క్వాట్రో వేరియంట్లో 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించారు. ఉంటుంది. ఇది గరిష్టంగా 312 బిహెచ్పి శక్తిని మరియు 540 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన 55 క్వాట్రో మరియు ఎస్ వేరియంట్లు రెండూ 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తాయి.

ఈ రెండు వేరియంట్లలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి గరిష్టంగా 402 బిహెచ్పి పవర్ను మరియు 664 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. బేస్ వేరియంట్ అయిన ఆడి ఇ-ట్రోన్ 50 359 కిలోమీటర్ల రేంజ్ను ఆఫర్ చేస్తుండగా, ఆడి ఇ-ట్రోన్ 55 పూర్తి ఛార్జ్పై 484 కిలోమీటర్ల రేంజ్ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

చార్జింగ్ విషయానికి వస్తే, 150 కిలోవాట్ల డిసి ఛార్జర్ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో ఈ కారు బ్యాటరీలను 0-80 శాతం వరకూ ఛార్జ్ చేయవచ్చని ఆడి ఇండియా పేర్కొంది. అదే 11 కిలోవాట్ల ఏసి ఛార్జర్ను ఉపయోగించినట్లయితే, 0-80 శాతం చార్జ్ సుమారు 8.5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారులో ముందు వైపు ఆక్టాగన్ ఆకారంలో ఉండే పెద్ద సింగిల్ ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్లతో కూడిన షార్ప్ హెడ్లైట్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ లైన్ మరియు రెండు టెయిల్ ల్యాంప్స్ను కలుపుతూ ఉన్నట్లుగా అనిపించే పూర్తి-వెడల్పుతో కూడిన ఎల్ఈడి లైట్బార్, పెద్ద అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఈ కారులో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో రియర్ వ్యూ మిర్రర్ స్థానంలో కెమెరాలను ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. ఇవి నిత్యం కారుకి ఇరువైపులా వచ్చే ట్రాఫిక్ను కారు లోపలి డిజిటల్ డిస్ప్లే ప్రదర్శిస్తాయి. కారు లోపల రెండు పెద్ద డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు ఉంటాయి. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించబడుతాయి.

అంతేకాకుండా, ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వాయిస్ కమాండ్ ఫీచర్, యాంబియంట్ లైటింగ్, పానోరమిక్ సన్రూఫ్ మరియు సరౌండ్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా, ఆడి వర్చువల్ కాక్పిట్, యాంబియంట్ లైటింగ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్ప్లే, ఎనిమిది ఎయిర్బ్యాగులు కూడా ఈ కారులో లభిస్తాయి.

ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారుతో పాటుగా కంపెనీ పోర్టబుల్ 11 కివా కాంపాక్ట్ ఛార్జర్ను కూడా అందిస్తోంది. కస్టమర్ ఇంటి వద్ద లేదా ఆఫీసు వద్ద సెకండరీ వాల్ బాక్స్ ఏసి ఛార్జర్ను కూడా కంపెనీ ఇన్స్టాల్ చేసిస్తుంది. అదనంగా, ఆడి భారతదేశం అంతటా ఎంచుకున్న అవుట్లెట్లలో 50 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేస్తోంది. ఛార్జింగ్ వ్యవస్థను ఇన్స్టాల్ చేయడానికి కంపెనీ ఏబిబి సంస్థతో భాగస్వామ్యాన్ని కుదర్చుకుంది.


Click it and Unblock the Notifications








