కరోనా ఎఫెక్ట్ కార్లకే, ట్రాక్టర్లకు కాదు; అంతా రైతుల పుణ్యమే..
గడచిన సంవత్సరం భారతదేశంలో కరోనా వైరస్ మరియు దాదాపు మూడు నెలల పాటు సాగిన లాక్డౌన్ కారణంగా ప్యాసింజ్ వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయి. అయితే, ఇవి ట్రాక్టర్ల అమ్మకాలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.

గత 2020లో లాక్డౌన్ ముగిసిన తరువాత దేశంలో ట్రాక్టర్ విక్రయాలు జోరందుకున్నాయి. డిసెంబరు 2019తో పోల్చుకుంటే, డిసెంబర్ 2020లో దేశీయ ట్రాక్టర్ వ్యాపారం జోరుగా సాగింది. ఈ సమయంలో ట్రాక్టర్ అమ్మకాలు 41.8 శాతం పెరిగి, 60,717 యూనిట్లుగా నమోదయ్యాయి.

అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (డిసెంబర్ 2019లో) ట్రాక్టర్ల అమ్మకాలు 42,806 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. నిత్యావసర సరుకుల వినియోగం పెరగడంతో రైతులకు చేతినిండా పని దొరికినట్లయింది. రైతు పరిస్థితి మెరుగుపడటం, మంచి రుతుపవనాలు, రుణాల లభ్యత మరియు మద్ధతు ధరలు పెరగడం వంటి అంశాల వలన ట్రాక్టర్ల అమ్మకాలు కూడా పెరిగాయి.

ట్రాక్టర్ సేల్స్ విషయాని వస్తే, ఈ విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా మరియు స్వరాజ్ సంస్థలు ముందంజలో ఉన్నాయి. దేశీయ మార్కెట్లో డిసెంబర్ 2020లో మహీంద్రా మరియు స్వరాజ్ సంస్థల ట్రాక్టర్ల విక్రయాలు 23 శాతం పెరిగి 21,173 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ 2019లో ఇవి 17,213 యూనిట్లుగా ఉన్నాయి.

గడచిన సంవత్సరం కేవలం ట్రాక్టర్లే కాకుండా వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాల అమ్మకాలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయి. డిసెంబర్ 2020లో వీటి అమ్మకాలు 59.6 శాతం పెరిగాయి. డిసెంబర్ 2019లో ఇవి 6,952 యూనిట్లుగా ఉంటే డిసెంబర్ 2020లో ఇవి 11,095 యూనిట్లుగా నమోదయ్యాయి.

డిసెంబర్ 2019తో పోల్చితే వ్యవసాయ పరికరాల మార్కెట్ వాటా డిసెంబర్ 2020లో 2 శాతం వృద్ధి చెంది 18.2 శాతానికి చేరుకుంది. సోనాలికా ట్రాక్టర్స్ లిమిటెడ్ దేశంలో మూడవ అతిపెద్ద ట్రాక్టర్ అమ్మకపుదారునిగా అవతరించింది. సోనాలిక డిసెంబర్ 2020లో దేశీయ మార్కెట్లో 8,538 ట్రాక్టర్లను విక్రయించింది.

డిసెంబర్ 2020లో సోనాలికా మార్కెట్ వాటా 2.5 శాతం వృద్ధి చెంది 14 శాతానికి పెరిగింది. ట్రాక్టర్ అమ్మకాలలో జాన్ డీర్ మరియు ఎస్కార్ట్స్ కంపెనీలు వరుసగా నాల్గవ మరియు ఐదవ స్థానాల్లో ఉన్నాయి. డిసెంబర్ 2020లో జాన్ డీర్ 7,315 యూనిట్లను విక్రయించగా, ఎస్కార్ట్స్ 7,230 యూనిట్లను విక్రయించింది.

ఇక ఈ విభాగంలో ఇతర ట్రాక్టర్ బ్రాండ్ల అమ్మకాలు మొదటి ఐదు ట్రాక్టర్ బ్రాండ్ల అమ్మకాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని, దీని కారణంగా ట్రాక్టర్ల అమ్మకాలు ఊపందుకుంటున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. కంపెనీలు కూడా ప్రస్తుత డిమాండ్కు అనుగుణంగానే ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

గడచిన సంవత్సరం ప్రారంభంలో, దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి కారణంగా మొదట్లో అమ్మకాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలపై దాని ప్రభావం కాస్తంత తక్కువగానే ఉందని కంపెనీలు చెబుతున్నాయి. గతేడాది మెరుగైన రుతుపవనాలు మరియు వ్యవసాయానికి సంబంధించిన పథకాల వల్ల రైతుల ఆదాయం పెరిగింది. ఫలితంగా, వారి కొనుగోలు శక్తి కూడా పెరిగింది.

ప్రస్తుతం దేశలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో, వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాలను తయారీ చేసే సంస్థలు పూర్తి సామర్థ్యంతో తమ ప్లాంట్లలో ఉత్పత్తి చేపడుతున్నాయి. పై గణాంకాలను పరిశీలిస్తే, ఈ మహమ్మారి వ్యవసాయ వాహన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపలేదని తెలుస్తోంది.

దేశంలో లాక్డౌన్ కారణంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 80-90 శాతం మేర తగ్గాయి. ఇదే సమయంలో ట్రాక్టర్ల అమ్మకాలపై దాని ప్రభావం స్వల్పంగానే కనిపిస్తోంది. కాగా, కొత్త సంవత్సరంలో దాదాపు అన్ని ఆటో కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ట్రాక్టర్లు మరియు వాణిజ్య వాహనాలను తయారుచేసే కంపెనీలు ఇదే బాటను పట్టాయి. మహీంద్రా ట్రాక్టర్ ఇప్పటికే జనవరి నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








