రూ.71 కోట్ల పన్ను ఎగ్గొట్టిన మారుతి; డిఆర్ఐ నుండి షోకాజ్ నోటీసులు
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) మరియు కస్టమ్స్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పన్ను ఎగవేత కేసులో ఈ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

మారుతి సుజుకి సియాజ్ సెడాన్, ఎర్టిగా ఎమ్పివి మరియు ఎస్-క్రాస్ ఎస్యూవీ వంటి కొన్ని మోడళ్లలో ఉపయోగించిన ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ టెక్నాలజీపై కంపెనీ దాదాపు రూ.71 కోట్ల సుంకం చెల్లించలేదని డిఆర్ఐ ఆరోపించింది.

ఈ విషయంపై లక్నోలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) జరిపిన దర్యాప్తు తరువాత, మారుతి సుజుకి సంస్థకు ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ టెక్నాలజీపై డిఆర్ఐ 105 పేజీల షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ.70 కోట్ల డ్యూటీని ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతి సుజుకికి మరో నోటీసు జారీ చేయడాన్ని కూడా ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తున్నారు.

భారత ప్రభుత్వం 2017లో హైబ్రిడ్ కార్ల తయారీలో ఉపయోగించే టెక్నాలజీకి కస్టమ్ డ్యూటీలో మినహాయింపులను ఆఫర్ చేసే దిశలో భాగంగా, ప్రభుత్వం మారుతి సుజుకికి ప్రోత్సాహకాలను అందజేసింది. కంపెనీ ఈ మోడళ్లలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్లు మరియు అంతర్గత దహన యంత్రాలను (ICE) ఉపయోగిస్తుందని పేర్కొంది.

మారుతి సుజుకి తమ 'స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఫ్రమ్ సుజుకి' (ఎస్హెచ్విఎస్) టెక్నాలజీ కోసం మోటారు-జనరేటర్ యూనిట్ (ఎంజియు) లేదా ఆల్టర్నేటర్ను ఉపయోగిస్తున్నట్లు లక్నోలోని డిఆర్ఐ దర్యాప్తులో తేలినప్పుడు 2019లో పన్ను ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సంస్థల ప్రకారం, మారుతి సుజుకి ఉపయోగిస్తున్న ఎస్హెచ్విఎస్ టెక్నాలజీ సందేహాస్పదమైనది మరియు ఇది పూర్తి హైబ్రిడ్ టెక్నాలజీ కాదు.

ప్రస్తుతం, మారుతి సుజుకి తమ ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఎర్టిగా, సియాజ్, ఎస్-క్రాస్, బాలెనో, ఎక్స్ఎల్6 మరియు బ్రెజ్జా వంటి ఆరు కార్లలో ఉపయోగిస్తోంది. కంపెనీ ఈ కార్లను ప్రతి నెలా సుమారు 35,000 యూనిట్లకు పైగా విక్రయిస్తుంది.

మారుతి సుజుకి ఇండియా మొట్టమొదటిసారిగా, ఈ టెక్నాలజీని 2015లో ప్రారంభించిన సియాజ్ సెడాన్లో ఉపయోగించింది. ఆ తరువాత దీనిని ఇతర మోడళ్లలో కూడా ఉపయోగించారు. గత 2017 సంవత్సరంలో కంపెనీ 1 లక్షకు పైగా ఎస్హెచ్విఎస్ టెక్నాలజీతో కూడిన వాహనాలను విక్రయించింది. వచ్చే 2021 నాటికి ఇవి 5 లక్షలకు చేరుకుంటాయని అంచనా.

మారుతి సుజుకి బ్రాండ్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ సెడాన్ కార్ల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి ఇటీవలే గుజరాత్లోని కొత్త ప్లాంట్లో ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ సంస్థ ఏప్రిల్ 1 నుండి కొత్త ప్లాంట్లో డిజైర్ సెడాన్ ఉత్పత్తిని ప్రారంభించింది. అంతకుముందు వరకుసెడాన్ కార్లు కేవలం మానేసర్ ప్లాంట్లో మాత్రమే ఉత్పత్తి చేయబడేవి. కానీ ఇవి ఇప్పుడు హన్సాల్పూర్లో కూడా ఉత్పత్తి చేయబడుతున్నాయి.

గుజరాత్లోని సుజుకి మోటార్ కంపెనీ కాంట్రాక్టు ప్రాతిపదికన మారుతి సుజుకి కోసం కార్లను తయారు చేస్తుంది. ఈ ప్లాంట్ రెండు ప్రసిద్ధ మారుతి మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది, వీటిలో బాలెనో మరియు స్విఫ్ట్ కార్లు ఉన్నాయి. హన్సాల్పూర్ ప్లాంట్ సంవత్సరానికి 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గుజరాత్ ప్రభుత్వం 2018లో హన్సల్పూర్ వద్ద ఒక ప్లాంట్ కోసం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్కు భూమిని కేటాయించింది. ఈ ప్లాంట్ 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్లాంటును నిర్మించడానికి కంపెనీ సుమారు రూ.18 వేల కోట్ల పెట్టుబడులును వెచ్చించింది. హన్సాల్పూర్ ప్లాంట్కి డిజైర్ ఉత్పత్తికి తరలించిన తరువాత, గుర్గావ్ మరియు మానేసర్ ప్లాంట్లలో ఇప్పుడు చిన్న కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.
Source: HT Auto


Click it and Unblock the Notifications








