కరోనా ఫస్ట్ వేవ్ సమయంతో పోల్చుకుంటే సెకండ్ వేవ్ సమయంలోనే బెటర్!
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) జూన్ 2021 నెలకు గాను వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. గత నెలలో రిజిస్టర్ అయిన ద్విచక్ర వాహనాలు , త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు మరియు ప్రైవేటు, వాణిజ్య వాహనాల డేటాను ఫడా విడుదల చేసింది.

గత నెలలో కోవిడ్-19 సెకండ్ వేవ్ పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 43.45 శాతం వృద్ధిని సాధించినట్లు ఫడా పేర్కొంది. జూన్ 2021లో మొత్తం 1,84,134 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైయ్యాయని ఫడా గణాంకాలు చెబుతున్నాయి.

మొత్తంగా చూసుకుంటే, జూన్ 2021లో అన్ని విభాగాలకు చెందిన వాహనాల అమ్మకాలు 12,17,151 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2020తో పోలిస్తే, ఇవి 22.62 శాతం ఎక్కువగా ఉన్నాయని ఫడా పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా అంతకు ముందు సంవత్సరం జూన్ నెలలో కూడా వాహనాల అమ్మకాలు ప్రభావితమైన సంగతి తెలిసినదే.

ఈ ఏడాది కూడా సరిగ్గా మే, జూన్ నెలల్లో కరోనా సెకండ్ వేవ్ మార్కెట్లను కుదిపివేసింది. వైరస్ వ్యాప్తి భయంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. అయితే, గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ప్రస్తుత అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. కోవిడ్-19 సెకండ్ వేవ్ నుండి మార్కెట్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తిరిగి ట్రాక్లోకి వస్తోంది.

జూన్ 2020తో పోలిస్తే, జూన్ 2021 మొత్తం వాహనాల అమ్మకాలు 22.62 శాతం వృద్ధి చెందాయి. కానీ, జూన్ 2019 అమ్మకాలతో పోలిస్తే మాత్రం ఇవి 28.32 శాతం క్షీణతను నమోదు చేశాయి. జూన్ 2021 అమ్మకాలపై, ఫడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో మినహా దేశవ్యాప్తంగా మార్కెట్లు తిరిగి తెరుచుకుంటున్నాయని, ఆటో రంగం అమ్మకాలలో భారీ వృద్ధిని నమోదు చేయడానికి ఇదే కారణమని అన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత ఇస్తుడటంతో, ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఒక్కసారిగా జోరందుకుంది. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా పెరిగాయి. కానీ, కోవిడ్-19 సెకండ్ వేవ్ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు సెంటిమెంట్ ఇంకా మెరుగుపడలేదు.

బిఎస్-6 ఉద్గార నిబంధనల కారణంగా ఉత్పత్తి కొరత ఉన్నప్పటికీ, వాణిజ్య వాహనాల విభాగం గత సంవత్సరంతో పోల్చితే అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. అయితే, పరిస్థితులు సాధారణంగా ఉన్న జూన్ 2019 కాలంతో పోలిస్తే, జూన్ 2021లో మొత్తం వాహనాల అమ్మకాలు 28 శాతం మరియు త్రీ-వీలర్లు, వాణిజ్య వాహనాల అమ్మకాలు వరుసగా 70 శాతం మరియు 45 శాతం తగ్గాయి.

ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమను ప్రధానంగా వేధిస్తున్న అంశం సెమీకండక్టర్ చిప్స్ కొరత. దీని వలన వాహనాల డిమాండ్ మరియు సప్లయ్లో భారీ వ్యత్యాసం ఉంటోదని, తద్వారా రానున్న రోజుల్లో ప్యాసింజర్ వాహనాల పెరుగుదల రేటు పరిమితంగా ఉంటుందని ఫడా తెలిపింది.

మరోవైపు, వైరస్ యొక్క కొత్త రూపాలు మరియు ఆగస్టు నెలలో కోవిడ్-19 ధర్డ్ వేవ్ ప్రమాదం ఉందన్న అంచనాలు మార్కెట్ పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, జూలై నెలలో రుతుపవనాల తీరు మరియు పెరుగుతున్న వ్యాక్సీన్ రేటు కారణంగా మార్కెట్ వృద్ధిపై తయారీదారులు ఆశాజనకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications








