2021 కేంద్ర బడ్జెట్లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు
కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ 2021 కేద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి "నిర్మల సీతారామన్" బడ్జెట్ను ఈ రోజు ప్రకటించింది. ఈ సాధారణ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి వెహికల్ స్క్రాప్ విధానాన్ని కూడా ప్రకటించారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

2021 కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ లో వాహన స్క్రాప్ విధానం ప్రకారం, ప్రైవేటు వాహనాల విషయంలో 20 సంవత్సరాల తరువాత, వాణిజ్య వాహనాల విషయంలో 15 సంవత్సరాల తర్వాత వాహనాల ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. పాత వాహనాలను తొలగించడానికి స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానం వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

15 సంవత్సరాల వయస్సు గల ప్రభుత్వ వాహనాల కోసం ఇటీవల స్క్రాపింగ్ విధానం ఆమోదించిన విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వ వాహనాల కోసం ఈ విధానం ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుంది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చాలా కాలంగా ప్రభుత్వ వాహనాల స్క్రాప్ విధానాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నారు.

దీనికి తోడు ఇప్పుడు ఆర్థిక మంత్రి ప్రైవేట్ మరియు వాణిజ్య వాహనాల కోసం సాధారణ బడ్జెట్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది మాత్రమే కాకుండా, అత్యంత కలుషితమైన నగరాల్లో వాహనాలపై 50 శాతానికి పైగా గ్రీన్ టాక్స్ విధించే పని జరుగుతోంది. అలాగే, వాహనం యొక్క రకాన్ని మరియు ఇంధనాన్ని బట్టి ప్రత్యేక పన్ను విధిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతే కాకుండా, ఈ వాహనాలకు బదులుగా హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ లేదా సిఎన్జి, ఇథనాల్, ఎల్పిజి వంటివి వాడుతున్న వారికి ఈ రకమైన టాక్స్ విధించబడదు. ఇటువంటి వాహనాలను మినహాయించారు. ఇటువంటి వాహనాలకు మినహాయింపు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎక్కువమంది ప్రజలు వీటిపైనా దృష్టిపెడుతున్నారు.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఫేమ్ 2 స్కీమ్ కింద పనిచేస్తోంది. దీని కింద, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లు కూడా ఇవ్వబడతాయి. అంతే కాకుండా ఛార్జర్లపై తగ్గింపు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలపై తగ్గింపుతో పాటు మరెన్నో ప్రయోజనాలు కూడా ఇందులో కల్పించబడతాయి.

ఇటీవల కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన వస్తోంది. కావున వాహన తయారీదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడంవైపు నిమగ్నమవుతున్నారు. ఇక పాత వాహనాల విషయానికి వస్తే, ఈ విధానాన్ని సాధారణ బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత త్వరలో అమలు చేయనున్నారు. మొదట ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీ వంటి కలుషిత నగరాల్లో ఈ విధానం అమలు చేయబడుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపెరుగుదలతో కాలుష్యం కూడా భారీగా తగ్గుతుంది. అంతే కాకుండా దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ కాలానికి తగినట్టు ఉన్న వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రజలలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు కూడా భారీగా డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








