టాటా ఫౌండర్స్ ఎడిషన్ కార్లు విడుదల, అయితే ఇవి కేవలం వారికి మాత్రమే..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారతదేశంలో ఈ ఏడాది తమ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ అందిస్తున్న అన్ని మోడళ్లలో ఫౌండర్స్ ఎడిషన్ పేరిట ప్రత్యేకమైన కార్లను విడుదల చేసింది.

స్టాండర్డ్ కార్లతో పోల్చుకుంటే, ఈ ఫౌండర్స్ ఎడిషన్ కార్లలో అదనపు ఫీచర్లు లభిస్తాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న టియాగో, టిగోర్, నెక్సాన్, అల్ట్రోజ్ మరియు హారియర్ మోడళ్లలో ఈ ఫౌండర్స్ ఎడిషన్లు అందుబాటులో ఉంటాయి.

అయితే, ఈ టాటా ఫౌండర్స్ ఎడిషన్ కార్లు కేవలం టాటా గ్రూప్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ కార్లపై ప్రత్యేకంగా టాటా గ్రూప్ వ్యవస్థాపకులైన జె.ఆర్.డి టాటా (జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా) సంతకం ఉంటుంది.

అంతేకాకుండా, ఈ కార్లపై నీలిరంగు బ్యాగ్రౌండ్తో కూడిన ప్రత్యేక టాటా లోగో మరియు జెఆర్డి సంతకంతో కూడిన బ్యాడ్జ్ కూడా ఉంటాయి. ఈ కార్లను కొనుగోలు చేసే టాటా కస్టమర్లకు ఫోటో ఫ్రేమ్తో పాటు బ్రాండ్ ప్రయాణాన్ని వివరించే పోస్ట్కార్డ్లను కంపెనీ అందిస్తోంది.

ఈ స్పెషల్ ఎడిషన్ కార్లలో పైన పేర్కొన్న మార్పులు మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండవు. సాధారణ మోడళ్లలో లభించే అన్ని ఫీచర్లు, పరికరాలు వీటిలో కూడా ఉంటాయి. అయితే, వాటితో పోలిస్తే భిన్నంగా కనిపించేందుకు గాను ఈ కార్లపై స్పెషల్ లోగో మరియు సిగ్నేచర్ బ్యాడ్జ్ ఉంటాయి.

ఈ కార్లలో క్యాబిన్ లోపల, ఫ్రంట్ ఫెండర్ క్రీజ్, రియర్ పిల్లర్ మరియు డాష్బోర్డ్పై జెఆర్డి టాటా సిగ్నేచర్ బ్యాడ్జ్ అమర్చబడి ఉంటుంది. టాటా గ్రూప్ ఉద్యోగులు, ఈ ప్రత్యేకమైన కార్లను కొనాలనుకుంటే, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇవి కేవలం టాటా గ్రూపు ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం టాటా మోటార్స్ కూడా టాటా గ్రూపు కంపెనీలో ఒకటిగా కొనసాగుతోంది. టాటా గ్రూప్ను 1945లో జెమ్సెట్జీ టాటా స్థాపించారు. ఆ తర్వాత జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా నాయకత్వంలో టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్ కంపెనీ (ఇప్పుడు టాటా మోటార్స్)కు పునాది పడింది.

ఆ తర్వాతి కాలంలో ఈ సంస్థ 'టెల్కో' (టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్ కంపెనీ)గా ప్రసిద్ది చెందింది. పేరు సూచించినట్లుగా, ఈ కంపెనీ ఆటోమొబైల్స్ ఉత్పత్తి చేయాలి. కానీ, ఈ సంస్థను స్థాపించిన మొదటి 10 ఏళ్ల వరకూ టెల్కో ఎటువంటి వాహనాలను ఉత్పత్తి చేయలేదు.

ఆ తర్వాత, టెల్కో ఓ ట్రక్కును ఉత్పత్తి చేయడానికి 1954లో జర్మన్ కంపెనీ అయిన డైమ్లెర్ బెంజ్తో చేతులు కలిపింది. టాటా మోటార్స్ 1977లో వాణిజ్య వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది మరియు ఈ విభాగానికి సంవత్సరాలుగా మార్కెట్ లీడర్గా కొనసాగిన తరువాత, 1991లో ప్యాసింజర్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది.

టాటా మోటార్స్ తమ మొట్టమొదటి కారు టాటా సియెర్రాను 1991 లో విడుదల చేసింది, ఇది భారతదేశంలో డిజైన్ చేయబడి, తయారు చేయబడిన మొదటి మేడ్ ఇన్ ఇండియా కారు. ఈ సంస్థ 1997 లో భారతదేశంలో రూ.10,000 కోట్ల అమ్మకాలకు చేరుకున్న మొదటి ప్రైవేట్ సంస్థగా అవతరించింది. ఒక సంవత్సరం తరువాత, టెల్కో నుండి అత్యంత ప్రజాదరణ పొందిన కారు టాటా ఇండికా ప్రారంభించబడింది. దీనిని భారతదేశపు మొదటి ప్యాసింజర్ కారు అని కూడా పిలుస్తారు.


Click it and Unblock the Notifications