టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఆ "లైన్" దాటితే, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు!
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలను వసూలు చేయడానికి టోల్కు వర్తించే అన్ని వాహనాలకు ఫాస్టాగ్ నిబంధనను తప్పనిసరి చేసిన విషయం తెలిసినదే. ఫాస్టాగ్ వాడకాన్ని తప్పనిసరి చేయడంతో, ప్రయాణీకులు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.

టోల్ ప్లాజా వద్ద ఉపయోగించే సెన్సార్లు వాహనాలపై ఉండే ఫాస్టాగ్లను ఆటోమేటిక్గా స్కాన్ చేసి, ఓనర్ అకౌంట్ నుండి నగదును తమ ఖాతాలోకి బదిలీ చేసుకుంటాయి. అయితే, చాలా సందర్భాల్లో ఈ స్కానర్లు సరిగ్గా పనిచేయకపోవటం వలన కొన్నిసార్లు టోల్ ప్లాజా వద్ద వాహనాల ట్రాఫిక్ అధికంగా ఉంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో టోల్ అటెండర్లు మ్యాన్యువల్ స్కానర్లను ఉపయోగించి, టోల్ చార్జీని వసూలు చేస్తున్నారు. ఫలితంగా టోల్ బూత్ వద్ద వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి టోల్ ప్లాజాలా వద్ద వాహనాల రద్దీని తగ్గించడానికే ప్రభుత్వం ఈ ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

అయితే, ఇకపై టోల్ ప్లాజాల వద్ద, నిర్ధేశిత సమయం కన్నా ఎక్కువ సమయం వేచి ఉన్న వాహన చాలకులు ఎలాంటి టోల్ చార్జీని చెల్లించకుండా వెళ్లిపోవచ్చు. తాజాగా టిఓఐ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు మరియు ఎక్కువ సమయం వేచి ఉన్న కస్టమర్లకు పరిహారంగా వారిని ఉచితంగా టోల్ గేట్ల నుండి అనుమతించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఈమేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ బూత్లోని ప్రతి లైన్ వద్ద, కౌంటర్ నుండి కొంత దూరం తర్వాత ప్రత్యేకమైన రంగుతో ఓ గీతను గీస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య కారణంగా టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగి, వాహనాలు ఆ నిర్దేశిత గీతను దాటి ఉన్నట్లయితే, టోల్ ఆపరేటర్ అన్ని వాహనాల కోసం ఉచితంగా టోల్ గేట్ తెరవాల్సి ఉంటుంది.

టోల్ ప్లాజాలను సజావుగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి రోడ్డు రవాణా అధికారులు రియల్ టైమ్ పర్యవేక్షణలు చేస్తున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఫాస్టాగ్ను పూర్తిగా అమలు చేసే విధానంలో సంభవించే ఏవైనా సమస్యలకు ప్రణాళికలు మరియు పరిష్కారాలను అందించడానికి ఇది వారికి సహాయపడుతుంది.

టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ ద్వారా లావాదేవీల సంఖ్య 60-70 శాతం నుండి 90 శాతానికి పెరిగిందని, మారుమూల ప్రాంతాల్లో కూడా ఫాస్టాగ్ టోల్ వసూళ్లు భారీగా పెరిగాయని ఫాస్టాగ్ కోసం పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఏర్పడే ప్రసక్తే ఉండదని ఆయన అన్నారు.

దీనికి తోడు, ఫాస్ట్టాగ్కు సంబంధించిన ప్రభుత్వ పత్రం కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది, ఇది చెల్లింపులను సేకరించడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల నుండి పనిచేయకపోతే వినియోగదారుని టోల్ ఫీజు నుండి మినహాయించాలని అందులో పేర్కొనబడిది ఉంది. ఇది టోల్ ప్లాజా వద్ద రద్దీని తగ్గించడానికి మరియు ట్రాఫిక్ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం, కొత్త నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫాస్టాగ్ తప్పనిసరి చేయబడింది. ఇకపై కొత్త వాహనాలు ఫ్యాక్టరీ నుండే ఫాస్ట్ ట్యాగ్ అమర్చబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న వాహనాల కోసం కొత్తగా ఫాస్టాగ్ కొనాలని చూస్తున్న కస్టమర్ల కోసం వివిధ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్ సెంటర్స్, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్టీఓలు), రవాణా కేంద్రాలు, సాధారణ సేవా కేంద్రాలు, అలాగే పెట్రోల్ పంపుల నుండి కూడా ఫాస్టాగ్లను కొనుగోలు చేయవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంక్స్ మరియు పేటీఎం, అమెజాన్ వంటి సంస్థల ద్వారా కూడా ఇది అందుబాటులో ఉంది.
Source:TOI


Click it and Unblock the Notifications








