ఒక ఏడాదిలో టోల్ బూత్లన్నీ మాయం; జిపిఎస్ ఆధారంగా టోల్ వసూలు!
భవిష్యత్తులో జాతీయ రహదారులపై టోల్ బూత్లను లేకుండా చేస్తామని, టోల్ చార్జీల కోసం జిపిఎస్ ఆధారిత టెక్నాలజీని ఉపయోగిస్తామని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం నాడు ఆయన లోక్సభలో వాహన స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు.

ఇందులో భాగంగా, ఒక సంవత్సరంలోపు పూర్తి జిపిఎస్ ఆధారిత టోల్ వసూలును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, ఈ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయగలిగితే ఇకపై దేశంలో టోల్ బూత్లనేవే ఉండబోవని, జిపిఎస్ ఇమేజింగ్ (వాహనాలపై) ఆధారంగా డబ్బు వసూలు చేయబడుతుందని ఆయన లోక్సభలో తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్ట్టాగ్ను ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నాయని, అయితే మిగిలిన 7 శాతం మంది రెట్టింపు టోల్ చార్జీ చెల్లించినప్పటికీ తమ వాహనాలపై ఫాస్ట్ట్యాగ్ను అమర్చుకోవటం లేదని గడ్కరీ చెప్పారు.

ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి ఇంకా టోల్ చెల్లించని వాహనాల కోసం పోలీసు విచారణకు ఆదేశించినట్లు గడ్కరీ తెలిపారు. వాహనాల్లో ఫాస్ట్ట్యాగ్లు అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత వంటి కేసులు ఉంటాయని చెప్పారు. ఇకపై కొత్త వాహనాలను తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్లు అమర్చి విక్రయించబడుతాయని ఆయన తెలిపారు.

టోల్ ప్లాజా వద్ద ఎలక్ట్రానిక్ ఫీజుల చెల్లింపును సులభతరం చేసేలా ఫాస్ట్ట్యాగ్ విధానాన్ని 2016 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 16, 2021వ తేదీ నుండి దేశంలో ఫాస్ట్ట్యాగ్ నిబంధనను తప్పనిసరి చేశారు. జాతీయ రహదారుల గుండా ప్రయాణించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి అయింది మరియు ప్రతి టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ట్యాగ్ ద్వారానే టోల్ వసూలు చేయటం జరుగుతోంది. ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ట్యాగ్ లేని వాహనాలకు డబుల్ టోల్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఫాస్ట్ట్యాగ్ల కారణంగా టోల్ ప్లాజాల వద్ద అనవరసమైన వాహన రద్దీ తగ్గి, ప్రజలు వేగంగా టోల్ ప్లాజాలను దాటగలుగుతున్నారు.

ఫాస్ట్ట్యాగ్ ఆర్ఎఫ్ఐడి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ప్రతి ఫాస్ట్ట్యాగ్ కూడా ఓ ప్రీ-పెయిడ్ అకౌంట్లా పనిచేస్తుంది. యూజర్లు తమ ఫాస్ట్ట్యాగ్ ఖాతాలో కొంత మేర డబ్బును యాడ్ చేసుకోవటం లేదా దానిని మొబైల్ వాలెట్కు జతచేసుకోవటం ద్వారా టోల్ప్లాజాల వద్ద రిమోట్గా చెల్లింపులు చేయవచ్చు.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి జాతీయ రహదారులపై టోల్ టాక్స్ పెంచేందుకు కేంద్ర కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ రేట్లను 5 శాతం పెంచాలని యోచిస్తోంది. అంతే కాకుండా, ఎన్హెచ్ఏఐ నెలవారీ పాస్ ధరను కూడా రూ.10 నుంచి రూ.20కి పెంచనున్నారు.

ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎన్హెచ్ఏఐ టోల్ రేట్లను సవరిస్తుంది. ఈ పన్నుల పెరుగుదల సాధారణ ప్రజలతో పాటు వాణిజ్య వాహనాలపై కూడా పడుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో టోల్ టాక్స్ పెంపు జరుగుతుందని ఎన్హెచ్ఏఐ గోరఖ్పూర్ జోన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిఎం ద్వివేది అన్నారు. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








