గుడ్ న్యూస్.. హైదరాబాద్లో 118 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం, ఇంకో 20 స్టేషన్స్ అక్కడ కూడా..
భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్న కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో చాలామంది వాహనదారులు ఎలక్ట్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి, కానీ ఈ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కావలసినన్ని అందుబాటులో లేదు. కావున అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేకపోతున్నాయి. ఇదే సమయంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జిన్ సదుపాయాలను కల్పించడానికి ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకు కంకణం కట్టుకున్నాయి.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలను దృష్టిలో ఉంచుకుని వాటి అవసరాలను తీర్చడానికి ఏకంగా 118 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు భారీ పరిశ్రమల శాఖ కృషి చేస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్తో పాటు, వరంగల్ మరియు కరీంనగర్లలో ఒక్కక్క చోట 10 ఈవి ఛార్జింగ్ స్టేషన్లు కూడా రానున్నాయి. ఈ 20 స్టేషన్స్ తో కలిపి మొత్తం రాష్ట్రంలోని మొత్తం 138 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కేవలం 50 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువ భాగం మెట్రో స్టేషన్ల వద్ద ఉన్నాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్ ఏజెన్సీ అయిన తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలో 138 ఈవి ఛార్జింగ్ స్టేషన్ల ప్రక్రియను పరిశీలిస్తోంది.

ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని మరో ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. రోజు రోజుకి పెరుగుతున్న ఎలక్రిక్ వాహనాలకు కనీస మౌలిక సదుపాయాలు అందించడానికి భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మంత్రిత్వ శాఖ సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని మెట్రో స్టేషన్లు, గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ స్థలాల సమీపంలో రానున్నాయని తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతి స్టేషన్కు కనీసం రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఖర్చవుతుంది.

అలాగే పెద్ద ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకు దాదాపు రూ. 1.30 కోట్ల వరకు ఖర్చవుతుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ఈవి స్టేషన్స్ లో ఎక్కువ భాగం ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి, ఇవి ఐదు ప్లగ్లను కలిగి ఉంటాయి మరియు 60 నుండి 90 నిమిషాల్లో వాహనాన్ని ఛార్జ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వద్ద ఇంధన వినియోగం తగ్గుతుంది, తద్వారా నగరంలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్కు సేఫ్టీ యాక్ససరీస్ సంబంధిత సబ్స్టేషన్ పరికరాలతో ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ అవసరమని అధికారులు తెలిపారు. ఇవన్నీ త్వరలో అందుబాటులోకి రానున్నాయి, కావున హైదరాబాద్ ప్రజలకు ఛార్జింగ్ స్టేషన్స్ ఇబ్బందులు తొలగిపోతాయి.


Click it and Unblock the Notifications








