ఫేమ్ II పథకం క్రిందకు రానున్న హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ కార్లు
మనదేశంలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే వాహనాలను కూడా ఫేమ్ II పథకం క్రిందకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. హైబ్రిడ్ లేదా మైల్డ్ హైబ్రిడ్ కార్ల మాదిరిగా కాకుండా, హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ కార్లు పూర్తిగా సున్నా శాతం ఉద్గారాలను కలిగి ఉంటాయి.

హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్తో నడిచే ఇలాంటి వాహనాలను పర్యావరణానికి కూడా సురక్షితమైనవి కాబట్టి, వీటిని ఫేమ్ II పథకంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతే కాకుండా, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేయనుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ (ఫేమ్) స్కీమ్ను ప్రారంభించింది. ఈ ఫేమ్ స్కీమ్ యొక్క మొదటి దశను ఏప్రిల్ 2015లో రెండేళ్ల కాలపరిమితితో ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత మొదటి దశ ఫేమ్ కాలవ్యవధిని చాలాసార్లు పొడిగించారు మరియు ఇది మార్చి 31, 2019న పూర్తయింది.

కాగా, ఫేమ్ స్కీమ్ యొక్క రెండవ దశను ఏప్రిల్ 2019 నుండి మూడేళ్లపాటు కాలపరిమితితో ప్రారంభించారు. ఇటీవలి కాలంలో వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల తయారీతో పాటుగా హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ వాహనాలను కూడా తయారు చేస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ తరహా వాహనాలను కూడా ఫేమ్ పథకంలో తీసుకురావాలని భావిస్తోంది.

వాస్తవానికి హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్తో నడిచే వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాల కంటే కూడా పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవి. ఫేమ్ II ఈ వాహనాలను చేర్చడం ద్వారా వీటిని తయారు చేసే ఆటోమొబైల్ కంపెనీలు మరియు ఇలాంటి వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఇరువురూ ప్రభుత్వం నుండి లబ్ధి పొందనున్నారు.

మనదేశంలో హ్యుందాయ్, మారుతి సుజుకి వంటి సంస్థలు కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. హ్యుందాయ్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఓ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ కారును అందిస్తోంది. స్వచ్ఛమైన రవాణా రంగంలో హైడ్రోజన్ ఫ్యూయెల్ ఒక విప్లవాత్మకమైన మార్పు అని హ్యుందాయ్ అభిప్రాయపడింది.

ఇలాంటి హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ వాహనాలను తయారు చేసే సంస్థలకు ప్రభుత్వం తమ వైపు నుండి సహాయం అందించినప్పుడే సదరు వాహనాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చయటం సాధ్యమవుతుంది. ఇటీవలి కాలంలో భారతదేశంలో ఫేమ్ II పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే 38 కంపెనీలు నమోదు చేయబడ్డాయి.

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు భారతదేశంలో 69, 804 వాహనాలు ఫేమ్ II పథకం కింద అమ్ముడయ్యాయి. ఇందులో 54,179 ద్విచక్ర వాహనాలు, 14,000 త్రీ వీలర్లు మరియు 1524 నాలుగు చక్రాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, భారతదేశపు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేమ్ II పథకం కింద అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు (ఎలక్ట్రిక్ 2-వీలర్, 3-వీలర్ మరియు 4-వీలర్స్కు) సంబంధించి జారీ చేసిన ఫేమ్ II ధృవపత్రాల చెల్లుబాటును (సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ) మరో ఏడాది కాలం పాటు పొడగించినట్లు ప్రకటించింది.

ఇదివరకటి నోటిఫికేషన్ ప్రకారం, ఫేమ్ II పథకం క్రింద జారీ చేసిన సర్టిఫికెట్ల చెల్లుబాటు మార్చి 31, 2021తో ముగిసింది. కాగా, మార్చి 31, 2021 తర్వాత ఫేమ్ II సర్టిఫికేట్ జారీ చేసిన వాహన తయారీదారులకు ఈ సర్టిఫికెట్ చెల్లుబాటును మరో 12 నెలల వరకు పొడిగిస్తున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.


Click it and Unblock the Notifications








