హ్యుందాయ్ 'షీల్డ్ ఆఫ్ ట్రస్ట్' మెయింటినెన్స్ ప్రోగ్రామ్ - డీటేల్స్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ వినియోగదారుల కోసం ఓ కొత్త సర్వీస్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. హ్యుందాయ్ 'షీల్డ్ ఆఫ్ ట్రస్ట్' పేరిట కంపెనీ ఓ మెయింటినెన్స్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. వాహనం యొక్క ఓనర్షిప్ కాలంలో మెయింటినెన్స్ ఖర్చును తగ్గించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని కంపెనీ తెలిపింది.

కేవలం కార్లను విక్రయించడమే కాకుండా, విక్రయం తర్వాత నాణ్యమైన సేవలను కూడా అందించాలనే ఉద్దేశ్యంతో హ్యుందాయ్ ఈ 'షీల్డ్ ఆఫ్ ట్రస్ట్' ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది. కస్టమర్లు ఈ ప్యాకేజ్ను కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో కానీ లేదా మొదటి ఉచిత సర్వీస్ను చేయించే సమయంలో కానీ పొందవచ్చు.

హ్యుందాయ్ షీల్డ్ ఆఫ్ ట్రస్ట్ కార్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 9 కార్లు చేర్చబడ్డాయి. ఈ మెయింటినెన్స్ సర్వీస్ 14 రకాల వేర్ అండ్ టేర్ భాగాలను కవర్ చేస్తుంది. ఇందులో బ్రేక్స్, క్లచ్, వైపర్స్, బల్బ్స్, హోస్ బెల్ట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ ప్యాకేజ్ చెల్లుబాటులో ఉన్న సమయంలో ఈ భాగాలను ఉచితంగా రిపేర్ చేయటం లేదా రీప్లేస్ చేయటం చేస్తారు.

అంటే, కారు కొనుగోలు చేసినప్పటి నుండి ఐదేళ్లలో కంపెనీ పైన పేర్కొన్న 14 రకాల వేర్ అండ్ టేర్ భాగాలలో ఏవైనా సమస్యలు తలెత్తితే, వాటిని ఉచితంగా సరిచేస్తుంది. ఈ ప్యాకేజీ కింద, వినియోగదారులు ఏ అధికారిక హ్యుందాయ్ సేవా కేంద్రంలోనైనా ఐదేళ్లపాటు సేవలను పొందవచ్చు.

ఈ సేవా ప్యాకేజీలో కాంటాక్ట్లెస్ సర్వీస్, పికప్ మరియు డ్రాప్ సదుపాయాలను కూడా సంస్థ కల్పిస్తోంది. అంతేకాకుండా, కస్టమర్లు తమ కారు సర్వీస్ అపాయింట్మెంట్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవటం, వాహన సర్వీస్ స్థితి గురించి తెలుసుకోవటం మరియు డిజిటల్గా చెల్లింపులు చేయటం వంటి సేవలను కూడా ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారతదేశంలో తమ వ్యాపారాన్ని ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకూ ఈ కంపెనీ మన దేశంలో 9 మిలియన్లకు పైగా కార్లను విక్రయించింది.

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా మే 6, 1996న భారతదేశంలో తన మొదటి ప్లాంటును స్థాపించింది. ఈ కంపెనీ నుండి మొట్టమొదటిగా భారత్లో విడుదలైన కారు హ్యుందాయ్ శాంత్రో. గతంలో ఈ కారును కంపెనీ నిలిపివేసినప్పటికీ, ఆ తర్వాత రిఫ్రెష్డ్ రూపంలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ సంస్థను ప్రారంభించిన మొదటి 10 ఏళ్లలో కంపెనీ ఐ10, ఐ20, గెట్జ్, ఎక్సెంట్ వంటి అనేక మోడళ్లను విడుదల చేసింది. భారతదేశంలో మారుతి సుజుకి బ్రాండ్ తర్వాత అతి తక్కువ వ్యవధిలో హ్యుందాయ్ దేశంలోనే రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.

అంతేకాదు, ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల ఎగుమతిదారుగా ఉంది. మనదేశంలో హ్యుందాయ్ తయారు చేసే కార్లను 88 కి పైగా దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తుంది. తాజా గణాంకాల ప్రకారం, హ్యుందాయ్ ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా కార్లను ఎగుమతి చేసింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియాకు దేశంలోని వివిధ నగరాల్లో 1,154 డీలర్షిప్లు మరియు 1,298 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ 17.4 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ సంస్థ ఇప్పటివరకు భారతదేశంలో 4 బిలియన్ డాలర్లు పెట్టుబడి వెచ్చించింది.


Click it and Unblock the Notifications