కార్లలో మండుతున్న బ్యాటరీ ప్యాక్స్; 76,000 హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్లు రీకాల్
కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ విక్రయిస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఈ కార్లలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్లో సాంకేతిక లోపాల కారణంగా మంటలు చెలరేగుతున్న సంఘటనలు అధికం కావటంతో, కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విక్రయించిన కోనా ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బ్యాటరీ ప్యాక్ అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా సుమారు డజనుకు పైగా కేసులు నమోదు కావటంతో, హ్యుందాయ్ గడచిన 2018 నుండి 2020 మధ్య కాలంలో నిర్మించిన సుమారు 76,000 కోనా ఈ.వి. లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ సంస్థకు ఈ రీకాల్ ఓ చేదు జ్ఞాపంగా మిగిలిపోనుంది. ఈ రీకాల్ను పూర్తి చేయటానికి హ్యుందాయ్ సుమారు 900 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్లలోని బ్యాటరీ ప్యాక్స్లో ఉపయోగించిన సెల్స్ను ఎల్జి కెమ్ నుండి కొనుగోలు చేశారు.

ఇవే ఎల్జి కెమ్ సెల్స్ను కంపెనీ తయారు చేస్తున్న అయానిక్ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కొన్ని రకాల ఎలక్ట్రిక్ బస్సులలో కూడా కంపెనీ ఉపయోగించింది. నవంబర్ 2017 మరియు మార్చి 2020 మధ్య నిర్మించిన కొన్ని అయోనిక్ ఇవిలు మరియు ఎలక్ట్రిక్ బస్సులలో ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. మొత్తంగా, 82,000 వాహనాలను హ్యుందాయ్ రీకాల్ చేస్తోంది.

ఈ రీకాల్కు వర్తించి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఈ బ్యాటరీ ప్యాక్ ఫైర్ సమస్యను సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ద్వారా పరిష్కరించడానికి వీలుగా హ్యుందాయ్ మరియు ఎల్జి కెమ్ సంస్థలు ఆయా వాహనాల్లోని బ్యాటరీలను పూర్తిగా రీప్లేస్ చేయాలని నిర్ణయించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది.

గడచిన డిసెంబర్ నెలలో హ్యుందాయ్ భారత మార్కెట్లో కూడా కోనా ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారులో కొన్ని సాంకేతికపరమైన సమస్యల దృష్ట్యా వాటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 1, 2019 నుండి అక్టోబర్ 31, 2020 మధ్య కాలంలో తయారు చేసిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీలు ఈ రీకాల్కు వర్తిస్తాయి.

ఈ సమయంలో కంపెనీ మొత్తం 456 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇవన్నీ కూడా ఈ స్వచ్ఛంద రీకాల్కు వర్తిస్తాయని వివరించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల హై-వోల్టేజ్ బ్యాటరీ వ్యవస్థలలోని విద్యుత్ లోపం కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. రీకాల్కు వర్తించే వాహనాల్లో ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీలో 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 134 బిహెచ్పి శక్తిని మరియు 395 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. కోనా ఈవి కేవలం 9.7 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

పూర్తి ఛార్జీపై హ్యుందాయ్ కోనా 452 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులోని 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏసి ఛార్జర్ ఉపయోగిస్తున్నప్పుడు వంద శాతం ఛార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్కు కనెక్ట్ చేసినట్లయితే, కేవలం 57 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం చార్జ్ అవుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ కోనా రెండు వేరియంట్లలో లభిస్తోంది. మార్కెట్లో దీని ధరలు రూ.23.75 లక్షల నుండి ప్రారంభం అవుతాయి (ఎక్స్-షోరూమ్ ఇండియా). ఇది ఈ విభాగంలో ఎమ్జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీకి పోటీగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








