భారత్కు చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ; బుకింగ్స్ ప్రారంభం
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ గతేడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీని భారత్కు తీసుకురావటం ప్రారంభించింది. ఇటీవలే ఈ కారు షిప్మెంట్ను ముంబై నౌకాశ్రయంలో దిగుమతి చేస్తుండగా కెమెరాకు చిక్కింది.

భారత్లో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్లను కూడా ప్రారంభించింది. దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ అనే మూడు వేరియంట్లలో అందించనున్నారు. ఇవి మూడు కూడా ఒకే ఒక పవర్ట్రైన్ ఆప్షన్ (ఈవి400)తో లభ్యం కానున్నాయి.

ఐ-పేస్ జాగ్వార్ నుండి వస్తున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కార్, దీనిని 2018లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇందులో సరికొత్త వెర్షన్ను ఇటీవలే ఆవిష్కరించారు. మునుపటి తరం మోడల్తో పోలిస్తే, ఈ సరికొత్త 2021 జాగ్వార్ ఐ-పేస్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీలో అనేక అప్గ్రేడ్స్ మరియు కీలకమైన ఫీచర్స్ ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారులో స్లైడింగ్ రూఫ్, ఎల్ఈడి హెడ్ల్యాంప్, ఎల్ఇడి టెయిల్ లైట్స్, హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, సైడ్ మిర్రర్స్పై టర్న్ ఇండికేటర్, పెద్ద ఎయిర్ ఇన్టేక్ డ్యామ్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

దీని కొలతలను గమనిస్తే, ఇది 4682 మిమీ పొడవు, 2011 మిమీ వెడల్పును మరియు 1566 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 174 మిమీగా ఉంటుంది మరియు వీల్బేస్ 2990 మిమీగా ఉంటుంది. ఈ కొలతలతో ఇది విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ను కలిగి ఉంటుంది.

ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారును ఫుజి వైట్, కాల్డెరా రెడ్, సాంటోరిని బ్లాక్, యలుంగ్ వైట్, సింధు సిల్వర్, ఫ్రాంజి రెడ్, కాసియం బ్లూ, బోరాస్కో గ్రే, అగర్ గ్రే, పోర్టోఫినో బ్లూ, ఫెర్రల్ పెర్ల్ బ్లాక్ మరియు అరుబాతో సహా మొత్తం 12 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఇంకా ఇందులో 8 రకాలుగా సర్దుబాటు చేయగల లుస్టెక్ స్పోర్ట్స్ సీట్లు, 380 వాట్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 3డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, యానిమేటెడ్ డైరెక్షనల్ ఇండికేటర్, హెడ్స్ అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలోని పవర్ట్రైన్ విషయానికి వస్తే, ఇందులోని రెండు యాక్సిల్స్లో (ఫ్రంట్ అండ్ రియర్) ఒక్కొక్కటి చొప్పున మొత్తం రెండు సింక్రోనస్ పర్మినెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి మొత్తంగా 395 బిహెచ్పిల శక్తిని మరియు 696 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది (ఆల్-వీల్ డ్రైవ్).

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. పూర్తి చార్జ్పై ఇది 480 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ (మైలేజ్)ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ కారులో 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని 100 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ను ఉపయోగించి 0-80 శాతం నుండి ఛార్జ్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. మరోవైపు, 7 కిలోవాట్ ఏసి వాల్ బాక్స్ ఛార్జర్ ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే, 10 గంటల వ్యవధిలో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని మొదటిసారి 2018 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు. ఈ కారుని 10 లక్షల 50 వేల కిలోమీటర్లు నడపడం ద్వారా, దీని 200 ప్రోటోటైప్లను పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర రూ.50 లక్షలకు ఎగువన ఉండొచ్చని అంచనా. దీని డెలివరీలు మార్చ్ నాటికి ప్రారంభం కావచ్చని సమాచారం. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి మరియు త్వరలో భారత్కు రానున్న ఆడి ఇ-ట్రోన్ మరియు టెస్లా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








